ఐదేళ్ల నుంచి వరి మెట్ట పంటలు సాగు చేస్తున్న రైతు జితేందర్రెడ్డి
బొంరాస్పేట, అక్టోబర్ 19 : రసాయనిక ఎరువులు, పురుగు మందులను ఉపయోగించి పంటలను పండిస్తే నేలలో ఉత్పాదక శక్తి తగ్గి, సారం తగ్గుతుంది. నేల, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. పంటలకు పురుగు మందులు, రసాయనిక ఎరువుల వాడకం వల్ల మనం తినే ఆహార ధాన్యాలు విషతుల్యమై ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. పశు పక్షాదులు, పెంపుడు జంతువులకు ఎంతో హాని కలుగుతుంది. దీనిని నివారించడానికే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభావితుడైన మండలంలోని మెట్లకుంట గ్రామానికి చెందిన రైతు జితేందర్రెడ్డి రసాయనిక ఎరువులు, పురుగు మందుల ఊసే లేకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలు పండిస్తున్నాడు. అధిక ఉత్పత్తి, లాభదాయకత మీద దృష్టిపెట్టకుండా ఐదేండ్లుగా ఆయన సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న పది ఎకరాల పొలంలో 2017 నుంచి 19 వరకు మూడు ఎకరాలలో సేంద్రీయ పద్ధతిలో వరి పంటను సాగు చేయగా, 2019 నుంచి ఆరు ఎకరాలలో వరి, నాలుగు ఎకరాలలో మినుములు, పెసర పంటలను సాగు చేస్తున్నాడు. వీటితో పాటు ఎకరా విస్తీర్ణంలో ఉన్న మామిడి తోటకు కూడా సేంద్రీయ ఎరువులను ఉపయోగిస్తున్నాడు. దేశవాళీ విత్తనాలతో వరినాటు వేసినట్లు రైతు జితేందర్రెడ్డి తెలిపాడు. పంటలకు ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంటలు పండిస్తున్నానని తెలిపారు. ఈ ఎరువుల వాడకం వల్ల పంటలకు రోగాలకు తక్కువగా వస్తాయని, దిగుబడి కూడా తక్కువగా వస్తుందని వివరించాడు.
జీవామృతం ఎరువుల ఉపయోగం
వరి పంటకు జీవామృతం, అగ్ని అస్త్రం, నీమాస్త్రంతో తయారు చేసిన సేం ద్రియ ఎరువులను వినియోగించానని తెలిపాడు. ఆవుమూత్రం, పేడ, శనగపిండి, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన జీవామృతాన్ని వరి పంటకు 15 రోజులకు ఒకసారి వాడుతానని చెప్పాడు. అదేవిధంగా ఆవు మూత్రం, పచ్చిమిరప కాయలు, వెల్లుల్లి, పొగాకు మిశ్రమంతో తయారు చేసిన ద్రావణాన్ని, ఆవుమూత్రం, వేపాకు, నీటితో తయారు చేసిన ద్రావణాన్ని పంటలకు పిచికారీ చేసినట్లు తెలిపాడు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల వరి, పెసర, మినుము పంటలకు రోగాలు తక్కువగా వస్తాయని జితేందర్రెడ్డి చెప్పాడు. వచ్చిన వరిధాన్యాన్ని కుటుంబ అవసరాలకు మినహాయించుకుని మిగతా పంటను అమ్ముతానని చెప్పాడు. సేంద్రియ పంటలకు మార్కెట్లో సాధారణ రకం వరి బియ్యం కంటే క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఎక్కువగా ధర వస్తుందని తెలిపాడు.
సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో..
ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందన్న సుభాశ్ పాలేకర్ స్ఫూర్తి తోనే సేంద్రీయ వ్య వసాయానికి మొగ్గు చూపాను. సేంద్రియ వ్యవ సాయం వల్ల కలిగే లాభాలను ఒకసారి యూ ట్యూబ్లో చూసి హైదరా బాద్కు చెందిన సేవ్ సంస్థ నిర్వాహకుడు విజయరాం వద్దకు వెళ్లి విత్త నాలు తెచ్చుకుంటాను. ఐదేళ్ల నుంచి సేంద్రియ ఎరువులను ఉప యోగించి పంటలు పం డిస్తున్నా. సేంద్రియ ఎరువులు ఉపయోగించి పంటలు పండించే రైతు లంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాం. సేంద్రీయ పంటలతో వచ్చిన ఆహార ధాన్యాలు రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయి.