కొడంగల్, అక్టోబర్ 17: పల్లె ప్రగతి కార్యక్రమంతో అభివృది పనుల్లో గ్రామాలతో తండాలు పోటీ పడుతున్నాయి. గతంలో తండాలు అనగానే పేరుకుపోయిన చెత్త కుప్పలు, మురుగు వంటి సమస్యలతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయేవి మురుగు మధ్య గిరిజనులు జీవనాన్ని కొనసాగించే పరిస్థితి ఉండేది. కానీ రా్రష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన సౌకర్యాన్ని వారికే అప్పగించడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. పల్లె ప్రగతి సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన నాటి నుంచి గిరిజనుల్లో ఓ నూతనోత్సహం ఏర్పడి తండా అభివృద్ధికి ప్రత్యేకంగా పాటుపడుతున్నారు. అన్నింటా సౌకర్యాలతో గిరిజనులు సంతోషంగా తండాలో గర్వంగా జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొంటున్నారు. మండలంలోని పలుగురాళ్లతండా గతంలో పర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. కొత్త పంచాయతీల ఏర్పాటుతో పలుగురాళ్లతండా, ఎక్కచెరువుతండా, గోప్యానాయక్ తండా, గడ్డమీది తండాలు కలిసి పలుగురాళ్లతండా గ్రామపంచాయతీగా ఏర్పడింది. తండాలో మొత్తం జనాభా 980 మంది, 510ఓటర్లు, 200 నివాస గృహాలు ఉన్నాయి. పలుగురాళ్లతండా నియోజకవర్గ కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతానికి చేరువలో స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటుంది. పల్లె ప్రగతి కార్యక్రమానికి ముందు తండాలో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం, రోడ్లపై మురుగునీరు పారుతూ నడిచే వీలు లేకుండా ఉండేది. నేడు కొంత వరకు సీసీ రోడ్లు ఏర్పాటు కావడంతో మురుగు మాయమై స్వచ్ఛత ఏర్పడింది. గతంలో తాగునీటి కోసం పొలాలను ఆశ్రయించాల్సి వచ్చేదని, మిషన్ భగీరథ పథకంతో తండాలో పూర్తి స్థాయిలో నల్లా కనెక్షన్లు అందించడంతో నేడు తండా వాసులు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీటిని అందుకుంటున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఎక్కచెరువుకుంట సమీపంలో వైకుంఠధామం..
చెరువు పక్కన వైకుంఠధామాలు ఏర్పాటు కాబడితే అన్నింటికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇదే తరహాలో పలుగురాళ్లతండాలోని ఎక్కచెరువుకుంట ప్రాంతంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. ప్రస్తుతం చాలా వరకు పనులు పూర్తికాగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. వైకుంఠధామం ప్రాంతంలోనే డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం, కంపోస్టుషెడ్ నిర్మించారు.
సీసీ రోడ్లతో స్వచ్ఛత వాతావరణం..
గ్రామ పంచాయతీ పరిధిలో ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధుల కింద రూ.7లక్షలతో ఎక్కచెరువుతండాలో, రూ.3లక్షలతో గోప్యానాయక్ తండాలో సీసీ రోడ్లు నిర్మించబడ్డాయి. రూ.12.50లక్షలతో క్రిమిటోరియం, రూ.2.50లక్షలతో కంపోస్టుషెడ్డు నిర్మించారు. తండా నర్సరీలో ప్రస్తుతం 11వేల మొక్కలు పెంచి రైతులకు, ఇంటి ఆవరణలో, రోడ్లపై మొత్తంగా 7వేలకు వరకు మొక్కలు నాటినట్లు పంచాయతీ సెక్రటరీ భాస్కర్ తెలిపారు. ఎల్ఈడీ బల్బ్లు ఏర్పాటు చేయడంతో రాత్రుల్లో తండా ఎల్ఈడీ కాంతుల్లో తండా వెలిగిపోతున్నది.
ఆహ్లాదకర వాతావరణంలో పల్లె ప్రకృతి వనం..
గ్రామానికి దూరంగా అటవీ, పొలాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో అన ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనంలో 350 రకాల మొక్కలు నాటి పెంచుతున్నారు. వైకుంఠధామానికి చేరువలోనే పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతి నిర్వహణలో భాగంగా పంచాయతీకి ప్రతి నెలా రూ.లక్షా 2వేల నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. నిధుల మేరకు తండాలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
పల్లె ప్రగతితో తండా అభివృద్ధి..
పల్లె ప్రగతి కార్యక్రమంతో తండా అభివృద్ధికి నాంది ఏర్పడింది. సీఎం కేసీఆర్ తండాలను జీపీలుగా ఏర్పాటు చేయడంతో పాటు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడంతో తండా రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం తండాలో వైకుంఠధామం, సీసీ రోడ్లు, ఎల్ఈడీ వెలుగులు, కంపోస్టుషెడ్డు, స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీరు వంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో తండావాసులు సంతోషంగా ఉన్నారు.
రోడ్డు సౌకర్యం కల్పించాలి..
పల్లె ప్రగతితో తండాలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, రోడ్డు సౌకర్యం లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. హస్నాబాద్ గ్రామం నుంచి తండా 4.2 కిలోమీర్ల దూరం ఉంది. ప్రస్తుతం వర్షాలకు రోడ్డు పూర్తి స్థాయిలో గుంతలుగా ఏర్పడింది. బీటీ రోడ్డు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులను కోరాం. ఇప్పటికైనా బీటీ రోడ్డు మంజూరు చేయాలి.
-దత్తునాయక్, స్థానికుడు
తండాలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి..
పల్లె ప్రగతితో గ్రామంలో అన్ని వసతులు కల్పించిండ్రు. అయితే రేషన్ బియ్యం కోసం 8 కిలోమీటర్ల దూరం పోతున్నాం. పలుగురాళ్లతండా ప్రత్యేక పంచాయతీగా అయినప్పటికీ పర్సాపూర్కు వెళ్లి రేషన్ తీసుకోవాల్సి వస్తున్నది. తండాలోనే దుకాణం ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
-రుక్కిబాయి, స్థానికురాలు