మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ తోడ్పాటును అందిస్తున్నది. బ్యాంగిల్ స్టోర్, బేకరీ, ఫాస్ట్ఫుడ్ సెంటర్, టీ షాప్ తదితర 95 రకాల వ్యాపారాలకు బ్యాంకు రుణాలను అందజేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో 2,677 మందికి విలేజ్ ఔట్లెట్లు ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఒక్కో గ్రామ సమాఖ్య సంఘం నుంచి ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకు సుమారు రూ.31కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలనూ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 1,477 మందికి రుణాలను అందజేసింది. రుణాలు తీసుకున్న మహిళలు వ్యాపారాల్లో రాణిస్తుండగా, మిగతా యూనిట్ల ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తున్నది.
పరిగి, సెప్టెంబర్ 17 : మహిళలు వ్యాపారాలు చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా సర్కారు తోడ్పాటును అందిస్తున్నది. గ్రామాల్లోనే వ్యాపారాలతో ఆర్థిక ప్రగతి సాధించేందుకు బ్యాంకు రుణాలు ఇప్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. ఆయా గ్రామాల్లో ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలు ఎలా సాగుతాయని పరిశీలించి మరీ రుణ సదుపాయాలు కల్పిస్తున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.31కోట్లు ఆర్థిక తోడ్పాటుతో 2,677 మంది మహిళలకు ఔట్లెట్ ఏర్పాటు చేయించాలనే ఉద్దేశంతో ఎంపిక ప్రక్రియ కొనసాగగా, ఇప్పటివరకు 1,477 ఔట్లెట్లు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఔట్లెట్లలో వ్యాపార లావాదేవీలు చక్కగా కొనసాగడంతోపాటు రుణాలు తిరిగి చెల్లింపు ప్రక్రియ చేస్తున్నారు. ఓవైపు వ్యాపారాన్ని విస్తరించుకోవడం, మరోవైపు రుణాల చెల్లింపు ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారు.
జిల్లాలో 2,677 ఔట్లెట్ల ఏర్పాటు లక్ష్యం
గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు విలేజ్ ఔట్లెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 647 గ్రామ సమాఖ్యలు ఉండగా, ఒక్కో గ్రామ సమాఖ్య నుంచి ముగ్గురు, కొన్నిచోట్ల ఐదుగురి వరకు ఎంపిక చేశారు. ఈ మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిధిలో 2,677 మందికి విలేజ్ ఔట్లెట్లు ఏర్పాటు చేయించాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. సుమారు రూ.31కోట్లు అంచనా వ్యయంతో ఈ ఔట్లెట్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ఆయా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించారు. తద్వారా ఆయా గ్రామాల్లో వివిధ రకాలకు సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రతి విలేజ్ ఔట్లెట్కు లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. ఇందులో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,477 ఔట్లెట్లను ఏర్పాటు చేశారు. రూ.12.61కోట్లు ఖర్చుతో ఈ ఔట్లెట్లు ఏర్పాటు అయ్యాయి. బ్యాంకు లింకేజీ ద్వారా 894 ఔట్లెట్లకు రూ.7.50కోట్లు, స్త్రీ నిధి ద్వారా 240 ఔట్లెట్లకు రూ. 1.82కోట్లు, సీఐఎఫ్ ద్వారా 343 యూనిట్లకు రూ. 3.28కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశారు. మిగతా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కసరత్తు కొనసాగుతున్నది.
లావాదేవీలు కొనసాగే వ్యాపారాలు
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేయిస్తున్న ఔట్లెట్లు సైతం ఆయా గ్రామాల్లో లావాదేవీలు చక్కగా కొనసాగి వ్యాపారాభివృద్ధి జరుగుతుందనే వాటినే ఎంపిక చేశారు. ప్రధానంగా పాల వ్యాపారం, పాన్షాప్, లేడీస్కార్నర్, కిరాణం దుకాణం, నర్సరీ ఏర్పాటు, బ్యాంగిల్ స్టోర్, బేకరీ, అగర్బత్తీల తయారీ, లాండ్రీ, మగ్గం వర్క్, ఫాస్ట్ఫుడ్ సెంటర్, టీ షాప్, టెంట్ అండ్ సప్లయింగ్, జిరాక్స్, హార్డ్వేర్ షాప్ వంటి 95 రకాల యూనిట్ల ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న ఈ యూనిట్లలో వ్యాపార లావాదేవీలు చక్కగా కొనసాగుతున్నాయి.
రుణ సదుపాయంతో లేడీస్కార్నర్
లక్ష రూపాయలు రుణ సదుపాయంతో మా గ్రామంలోనే లేడీస్కార్నర్ ఏర్పాటు చేసుకున్నా. వ్యాపారం చక్కగా కొనసాగుతున్నది. వ్యాపారం దినదినాభివృద్ధిగా కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందనున్నది. తద్వారా ఆర్థికంగా ఎదుగుతాం.
ఆర్థిక సాయంతో ప్రోత్సాహం
రూ.70వేలు రుణ సదుపాయం కల్పించారు. ఈ డబ్బులతో మా గ్రామంలోనే లేడీస్కార్నర్, చీరలు విక్రయాలు కొనసాగిస్తున్నా. గ్రామంలోనే నిరుపేదలైన వారికి ఇలాంటి ఆర్థిక తోడ్పాటు అందించి వ్యాపార పరంగా ప్రోత్సహించడం హర్షణీయం. తద్వారా మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఇంటివద్దే చీరల వ్యాపారం
రుణ సదుపాయం ద్వారా మా గ్రామంలో ఇంటివద్దే చీరల వ్యాపారం కొనసాగించాం. లక్ష రూపాయలతో ఈ వ్యాపారం ప్రారంభించాం. ఇప్పుడిప్పుడే వ్యాపారం వృద్ధి చెందుతున్నది. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి ఇలాంటి జీవనోపాధి కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా రాబోయే రెండుమూడు సంవత్సరాల్లో ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతాం.
జీవనోపాధి మెరుగుపరిచేందుకు..
సెర్ప్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో నిరుపేదలైన మహిళలను గుర్తించి వారి జీవనోపాధి మెరుగుపరుచుకోవాలని విలేజ్ ఔట్లెట్లు ఏర్పాటు చేయించాం. జిల్లా వ్యాప్తంగా ఈసారి 2,677 యూనిట్లు ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రతి గ్రామ సమాఖ్య పరిధిలో ముగ్గురు నుంచి ఐదుగురిని ఎంపిక చేసి వారికి బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, సీఐఎఫ్ ద్వారా రుణ సదుపాయం అందించాం. సంబంధిత గ్రామంలో చక్కటి వ్యాపార లావాదేవీలు కొనసాగే యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందనున్నది.