బొంరాస్పేట, నవంబర్ 16 : యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. వరిసాగు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకునే బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని వ్యవసాయాధికారులు రైతులను చైతన్యం చేస్తున్నారు. వరిసాగును గణనీయంగా తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయించే విధంగా ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నీటి వసతి ఉండే పొలాల్లో వరికి ప్రత్యామ్నాయంగా పప్పు దినుసుల పంటలను సాగు చేస్తే లాభాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. పప్పు దినుసులైన కంది, పెసర, మినుములు, వేరుశనగ, బబ్బెర్లు వంటి పంటలను యాసంగిలో రైతులు ఎంచుకుని సాగు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. వికారాబాద్ జిల్లాలో యాసంగిలో రైతులు శనగ 13 ఎకరాలు, కంది 600, పెసర 4వేలు, మినుములు 2 వేల ఎకరాలు, బబ్బెర్లు 600 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఎకరా వరి పంటను సాగు చేస్తే రైతుకు రూ. 25వేల వరకు పెట్టుబడి వస్తుంది. దిగుబడి ఎకరాకు 25 క్వింటాళ్లు వస్తుంది. ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు చేస్తే ఎకరాకు రూ.49 వేలు వస్తుంది. ఖర్చులు పోనూ రైతుకు 24వేలు లాభం మిగులుతుంది. యాసంగిలో కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుకు ప్రస్తుతమున్న మద్దతు ధరలు రావు. బయట మార్కెట్లోకి తీసుకెళ్తే వరికి క్వింటాలుకు రూ.1200ల వరకు కొనుగోలు చేస్తారు. ఇదే జరిగితే రైతుకు ఏమీ మిగలదు. అదే పప్పు దినుసుల పంటలను సాగు చేస్తే వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడమే కాకుండా ధర కూడా పలుకుతుంది.
వేరుశనగ దిగుబడి అధికం
నీటి వసతి ఉండే బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునే అవకాశం ఉన్న పంట వేరుశనగ. ఎకరా వేరుశనగ పంటను సాగు చేయడానికి రైతుకు అయ్యే ఖర్చు రూ.15 వేలు. ఎకరాకు వచ్చే దిగుబడి ఆరు క్వింటాళ్లు. వేరుశనగకు మార్కెట్లో క్వింటాలుకు రూ.7 వేలు పలికినా రూ.42 వేలు వస్తుంది. ఖర్చులు పోనూ రైతుకు దాదాపుగా రూ.27 వేలు లాభం వస్తుంది. వీటితో పాటు మినుములు, బబ్బెర్లు వంటి వాటిని రైతులు అంతర పంటలుగా సాగు చేస్తే మంచి లాభం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
కంది పంట ఖర్చుతక్కువ..
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా సూచించే పంట కంది. దీనిని వానకాలంతో పాటు యాసంగిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరా కంది సాగు చేయడానికి రైతుకు రూ.30వేల వరకు ఖర్చవుతున్నది. ఎకరా కంది సాగు చేస్తే వచ్చే దిగుబడి సుమారుగా ఏడు నుంచి 8 ఎకరాల వరకు ఉంటుంది. కంది క్వింటాలుకు మార్కెట్లో రూ.7 వేల వరకు ధర పలికినా ఎకరాకు 56వేలు వస్తుంది. ఖర్చులు రూ.30వేలు పోనూ రైతుకు రూ.26 వేలు లాభం వస్తుంది.
పెసర లాభాలు బాగు
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయాధికారులు సూచిస్తున్న పంట పెసర. దీనిని ఒక ఎకరాలో సాగు చేస్తే అయ్యే ఖర్చు రూ.16వేలు. వచ్చే దిగుబడి సుమారుగా 4 క్వింటాళ్లు ఉంటుంది. పెసరకు క్వింటాలుకు రూ.8 వేలు ధర వచ్చినా రూ.32వేలు వస్తుంది. ఖర్చులు పోనూ రైతుకు రూ.16వేలు లాభం మిగులుతున్నది.
రైతులను చైతన్యం చేస్తున్నాం
వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునే పంటల గురించి రైతులను చైతన్యం చేస్తున్నాం. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పెసర, మినుములు, నువ్వులతో పాటుగా కూరగాయల పంటలను సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయి. నీటి వసతి ఉన్న బోర్ల కింది రైతులు వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి.
-వినయ్కుమార్, ఏడీఏ కొడంగల్