వికారాబాద్ జిల్లా వాసికి దక్కిన అరుదైన గౌరవం
పరిగి, అక్టోబర్16: హైకోర్టు జడ్జిగా వికారాబాద్ జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఎం.లక్ష్మణ్ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. నాంపల్లి లేబర్ కోర్టు నం.1 ప్రిసైడింగ్ అధికారిగా కొనసాగిన లక్ష్మణ్ను న్యాయాధికారుల కోటాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా కేంద్రం ఆమోదించింది. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మం డలం వెల్చాల్ గ్రామానికి చెందిన రుక్కమ్మ-అడివయ్య దంపతుల కుమారుడు లక్ష్మణ్. ఆయన ప్రాథమిక విద్య వెల్చాల్లో పూర్తి చేయగా, 6-9వ తరగతి వరకు సంగారెడ్డి జిల్లా కోహీర్లో, టెన్త్ పరిగిలో, ఇంటర్ వికారాబాద్లోని ఎస్ఏపీ కళాశాలలో, డిగ్రీ సైఫాబాద్ పీజీ కళాశాలలో, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో పూర్తి చేశారు. 1991లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్న లక్ష్మణ్ రంగారెడ్డి జిల్లా, సిటీ సివిల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన లక్ష్మణ్ జిల్లా జడ్జి(ఏడీజే)గా ఎంపికయ్యారు. అనంతరం వివిధ కోర్టుల్లో పని చేశారు.