వికారాబాద్, అక్టోబర్ 13 : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఆలంపల్లి అనంతపద్మనాభస్వామిని భక్తులు గురువారం గరుడ వాహనంపై ఊరేగించారు. స్వామివారిని అందంగా అలంకరించి అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. ఆలయ పుర వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తున్న సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులు పట్టి పూజలు చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ అనంతపద్మనాభస్వామికి పూజలు చేశారు. పల్లకీని మోస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం వారిని ఆలయ అధికారులు సన్మానించారు. వీరి వెంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు రామస్వామి, పుష్పలతారెడ్డి, నర్సింహులు, నాయకులు ఉన్నారు.