ధారూరు, ఆగస్టు 10: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులను పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. మంగళవారం ధారూరు మండలం నాగారం గ్రామంలో పర్యటించిన ఆమె యంత్రం ద్వారా వరి నాటు విధానం, పెసర పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పద్ధతితో కూలీల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో వరి సాగు చేయవచ్చని సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు ఇలాంటి యంత్రాలను ఎస్హెచ్జీ సభ్యులకు బ్యాంక్ రుణాల ద్వారా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. వారు రైతులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఈ యంత్రం ధర రూ.3.50లక్షలు ఉంటుందన్నారు. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మాట్లాడుతూ ఈ యంత్రంతో నాటువేస్తే ఎకరాకు 10కిలోల విత్తనాలు అవసరం ఉంటాయని, కూలీల ఖర్చు కూడా 50శాతం తగ్గుతుందన్నారు.కార్యక్రమంలో పరిగి ఏడీఏ వీరప్ప, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఈవోలు సంజువ్ రాథోడ్, హరిప్రసాద్, మంజుల, కుమ్మరిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.