మున్సిపల్ శాఖ చేపట్టిన భువన్ అసెస్మెంట్, జియో ట్యాగింగ్లో పరిగి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కింది. ఇంటి ఆస్తుల వివరాల సేకరణ వేగంగా సాగుతుండడంతో త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలో 5,490 ఇండ్లు ఉండగా, ఇప్పటి వరకు 5,393 ఇండ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. ప్రతి ఇంటి విస్తీర్ణమెంత.. ఎన్ని అంతస్తులు.. ఖాళీ స్థలమెంత అన్న వివరాలతో పాటు ఇంటి ఫొటోతో సహా భువన్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ నెలాఖరు లోపు ఇండ్లకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణకు ప్రత్యేక టీంలు కృషి చేస్తున్నాయి. సర్వే పూర్తి చేసి జియోట్యాగింగ్ చేసిన తర్వాత భువన్ యాప్లో ఇంటి నెంబర్ టైప్ చేస్తే సరి ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి.
పరిగి, సెప్టెంబర్ 26 : పురపాలక పరిపాలన శాఖ చేపట్టిన భువన్ అసెస్మెంట్, జియో ట్యాగింగ్లో పరిగి పురపాలక సంఘం రాష్ట్ర స్థాయిలోనే రెండవ స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా పరిధిలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, భువన్ యాప్లో ఆస్తుల వివరాల నమోదు, జియో ట్యాగింగ్లో టాప్ 10 స్థానాల్లో రెండు పురపాలక సంఘాలు నిలవడం గమనార్హం. ఈ నెలాఖరు లోపు వంద శాతం భువన్ యాప్లో నమోదు ప్రక్రియ, జియో ట్యాగింగ్ పూర్తి చేసే విధంగా సర్వే కొనసాగుతున్నది. ప్రతి మున్సిపాలిటీలోని ఇండ్లకు సంబంధించి పూర్తి వివరాలతోపాటు జియో ట్యాగింగ్ కోసం రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ భువన్ యాప్ ఏర్పాటు చేసింది. ఇందులో ఆయా మున్సిపాలిటీల పరిధిలోని గృహాలకు సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేస్తారు.
5,393 ఇండ్లకు జియో ట్యాగింగ్ పూర్తి
భువన్ యాప్లో ఇండ్లకు సంబంధించిన సమాచారం, జియో ట్యాగింగ్ చేయడంలో పరిగి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. పరిగి మున్సిపాలిటీ పరిధిలో 5,490 ఇండ్లు ఉండగా, ఇప్పటివరకు 5,393 ఇండ్లకు సంబంధించిన పూర్తి సమాచారం, జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. మరో 97 ఇండ్లకు సంబంధించిన సర్వే చేపట్టాల్సి ఉన్నది. దీంతో రాష్ట్రంలోనే భువన్ యాప్లో నమోదు ప్రక్రియకు సంబంధించి పరిగి మున్సిపాలిటీ రెండవ స్థానంలో నిలిచింది. ఇకపోతే భువన్ యాప్లో నమోదులో జిల్లాలోని కొడంగల్ 6వ స్థానంలో నిలవడం గమనార్హం. కొడంగల్ మున్సిపల్ పరిధిలో 3,827 ఇండ్లు ఉండగా, ఇప్పటివరకు 3,616 ఇండ్లకు సంబంధించిన సమాచారం అప్లోడ్, జియో ట్యాగింగ్ పూర్తి చేయగా, 211 ఇండ్ల సర్వే చేపట్టాల్సి ఉన్నది. దీంతో రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో ఉన్నది. జిల్లా కేంద్రమైన వికారాబాద్ మున్సిపాలిటీ భువన్ యాప్ నమోదు ప్రక్రియలో 12వ స్థానంలో నిలవడం గమనార్హం. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 13,886 ఇండ్లు ఉండగా, ఇప్పటివరకు 12,758 ఇండ్ల సర్వే పూర్తవగా 1,128 ఇండ్ల సర్వే చేపట్టాల్సి ఉన్నది. ఇదిలావుండగా వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు మున్సిపాలిటీ భువన్ యాప్ నమోదులో 114వ స్థానంలో నిలిచింది. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో 12,525 ఇండ్లుండగా 4,320 ఇండ్లకు సంబంధించిన సర్వే పూర్తి చేశారు. 8,905 ఇండ్ల సర్వే చేపట్టాల్సి ఉన్నది. ఈనెల 17వ తేదీ వరకు చేపట్టిన సర్వే వివరాలు ఈ విధంగా ఉండగా, ప్రతిరోజు ఆయా మున్సిపాలిటీల్లో ఇండ్ల సర్వే కొనసాగుతున్నది.
ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక టీంలు
మున్సిపాలిటీల్లోని ఇండ్లకు సంబంధించిన వివరాలు ఈ నెలాఖరు లోపు భువన్ యాప్లో నమోదు చేపట్టాలన్నది మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం. అందుకు తగ్గట్లుగా ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇండ్లకు సంబంధించిన సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించి ఎంత విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారు, ఎన్ని అంతస్తులు, ఖాళీ స్థలం ఎంత ఉన్నది.. కొలతలు చేసి నమోదు చేయడంతోపాటు ఫొటోను భువన్ యాప్లో అప్లోడ్ చేస్తారు. అలాగే ఇల్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా, గృహవసరాలకు వినియోగిస్తున్నారా, రెండు ఉన్నాయా తదితర అంశాలు సైతం పొందుపరుస్తున్నారు. అలాగే జీపీఎస్లో లొకేషన్ సైతం షేర్ చేస్తారు. జియో ట్యాగింగ్ ద్వారా భువన్ యాప్లో సంబంధిత ఇంటి నంబర్ టైప్ చేస్తే పూర్తి వివరాలు అందులో తెలుస్తాయి. మున్సిపాలిటీ నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలుసుకునేందుకు వీలుంటుంది. తద్వారా ఎలాంటి తప్పుడు వివరాలు లేకుండా పూర్తిస్థాయిలో ఈ వివరాల నమోదు భువన్ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ నెలాఖరు లోపు సర్వే పూర్తి చేయాలంటే రోజుకు ఎన్ని ఇండ్లు సర్వే చేపట్టాలనేది నిర్ణయించి, అందుకు అనుగుణంగా ప్రత్యేక టీంలు ఏర్పాటుచేసి భువన్ యాప్లో వివరాల నమోదు, జియో ట్యాగింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది పూర్తయితే ప్రతి మున్సిపాలిటీలోని ఇండ్లు, పూర్తి వివరాలు ఈ యాప్లో అందుబాటులో వస్తాయి.