ఒమిక్రాన్ రూపంలో కరోనా మూడోదశ ముప్పు పొంచి ఉండగా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతున్నది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కేసులు పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా పరీక్షల నిర్వహణ, హోం ఐసొలేషన్, దవాఖానల్లో చికిత్స చేసేందుకు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అధికారులు సిద్ధమయ్యారు. కరోనా టెస్ట్లు, వ్యాక్సినేషన్ వేగిరం చేశారు. మెదక్ జిల్లాలో 160 సాధారణ, ఆక్సిజన్ బెడ్స్ 135 సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఆక్సిజన్, సాధారణ బెడ్లు కలిపి 675 రెడీ చేశారు. ఆక్సిజన్ కొరత తలెత్తకుండా జిల్లాకేంద్ర దవాఖానలతో పాటు ప్రధాన వైద్యశాలల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభించారు. ఒక్కో జిల్లాకు లక్ష చొప్పున కరోనా కిట్లు,వెంటిలేటర్లు అందుబాటులో ఉంచారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో కరోనా కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇటీవల మంత్రి హరీశ్రావు జిల్లాకు లక్ష కరోనా టెస్టింగ్ కిట్లు మంజూరు చేశారు. ఇవి త్వరలోనే సంగారెడ్డికి చేరుకోనున్నాయి. గతంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం రక్తం నమూనాలను హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. కాగా, గతేడాది జూన్లో సంగారెడ్డి జిల్లా దవాఖానలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను ప్రారంభించడంతో ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 4611 శాంపిల్స్ పరీక్ష చేయగా, 161 మందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే, కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే రోగులకు హోం ఐసొలేషన్లో ఉంచి మందులు అందజేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ లక్ష హోం ఐసొలేషన్ కిట్లను అందుబాటులో ఉంచింది.
వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేసే సంగారెడ్డి జిల్లా కేంద్రం దవాఖానతో పాటు ఏరియా దవాఖానల్ల్లో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచింది. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో 135 బెడ్లను అందుబాటులో ఉంచగా, 30 ఐసీయూ బెడ్లను సిద్ధం చేసి ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. మొదటి, రెండో దశ సమయంలో కొన్నిచోట్ల ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం జిల్లాలోని అన్ని ఏరియా దవాఖానల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ను ఇటీవలే మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అలాగే, 13వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో ఉంది. రోగుల కోసం 30 వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచారు. జహీరాబాద్ ఏరియా దవాఖానలో 90 పడకలు, 10 ఐసీయూ బెడ్లు, నాలుగు వెంటిలేటర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఇక్కడ 500 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను నెలకొల్పింది. పిల్లలకు వైరస్ సోకితే చికిత్స అందజేసేందుకు మీర్జాపూర్లో 50 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. పటాన్చెరు ఏరియా దవాఖానలో 90 ఆక్సిజన్, పది ఐసీయూ పడకలు, రెండు వెంటిలేటర్లు, 500 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఉంది. నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో 70 పడకలు, రెండు వెంటిలేటర్లు, 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. జోగిపేట ఏరియా దవాఖానలో 70 ఆక్సిజన్ పడకలు, పది ఐసీయూ పడకలు, రెండు వెంటిలేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంటు నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. సదాశివపేటలో 30 పడకలు, ఆక్సిజన్ ప్లాంటు అందుబాటులో ఉన్నాయి.
పండుగ నేపథ్యంలో అప్రమత్తత అవసరం..
సంక్రాంతి పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా జిల్లాలో చాలాచోట్ల కొవిడ్ నిబంధనలను పాటించడంలేదు. మాస్కు ధరించకుండా సంచరిస్తున్నారు. పట్టణాల్లో జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. కరోనా, ఒమిక్రాన్లను నియంత్రించాలంటే ప్రజలు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మాస్కు ధరించటంతో పాటు భౌతికదూరం పాటిస్తూ, క్రమం తప్పకుండా చేతులు కడుక్కుని, శానిటైజర్లు వాడాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు.
థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం..
కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ దవాఖానల్లో ఐసీ యూ పడకలతో పాటు ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచాం. వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. థర్డ్వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో మెదక్
సిద్దిపేట జిల్లాలో..
కరోనా-ఒమిక్రాన్పై సిద్దిపేట జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు థర్డ్వేవ్ను ఎదుర్కోవడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 200 ఆక్సిజన్ బెడ్లు, 35 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉంచారు. గజ్వేల్ దవాఖానలో 100 పడకలు, దుబ్బాకలో 100 పడకల దవాఖానలు సిద్ధం చేశారు. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెండు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు, గజ్వేల్లో ఒక ప్లాంట్, సిద్దిపేటలో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రీటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర సమయంలో ఉపయోగించేందుకు రెమిడెసివర్ ఇంజక్షన్లు, అన్ని రకాల మందులు, పీపీఈ కిట్లు, మాస్క్లు సిద్ధం చేశారు. వీటితో పాటు ఆర్వీఎం, సురభి మెడికల్ కళాశాలలను కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి ప్రణాళికా సిద్ధం చేశారు.
సమర్థవంతంగా ఎదుర్కొంటాం
కరోనా, ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని దవాఖానల్లో పరీక్షల నిర్వహిస్తున్నాం. టెస్టింగ్ కిట్లు అంతటా అందుబాటులో ఉంచాం. పాజిటివ్ వస్తే హోం ఐసొలేషన్ ఉండాలని సూచిస్తున్నాం. తీవ్రత ఎక్కువగా ఉంటే దవాఖానల్లో చేర్చుకుంటాం. రోగుల కోసం ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాం. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలి. అలాగే, వ్యాక్సిన్ తీసుకోవాలి.
-డాక్టర్ సంగారెడ్డి, డీసీహెచ్ఎస్, సంగారెడ్డి జిల్లా
మెదక్ జిల్లాలో 160 బెడ్లు సిద్ధం..
కరోనా థర్డ్ వేవ్ ముప్పు మెదక్ జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. నిన్న మొన్న టి వరకు తక్కువ సం ఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. ఫస్ట్, సెకండ్ దశల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తోంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో దవాఖానలను సన్నద్ధం చేసి, వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. అవసరం మేర కు బెడ్లను, ఆక్సిజన్ను సిద్ధం చేసింది. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. మెదక్ జిల్లాకేంద్ర దవాఖానలోని ఐసీయూ లో 25 పడకలు, ఆక్సిజన్ బెడ్లు 75 సిద్ధం చేశారు. నర్సాపూర్ ఏరియా దవాఖానలో 40 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయగా, తూప్రాన్ సీహెచ్సీలో 25 పడకలను సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలో 200 వరకు పడకలు ఉండగా, 95 పడకలను కరోనా థర్డ్వేవ్ కోసం సిద్ధంగా ఉంచామని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్ ఇబ్బందులను పూర్తిగా దూరం చేసేలా ప్రభుత్వం చర్య లు చేపట్టంది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా కేంద్ర దవాఖాన ఆవరణలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ నుంచి నేరుగా వార్డుల్లో సేవలు పొందుతున్న రోగుల చెంతకే ఆక్సిజన్ సరఫరా చేసేలా పైపులైన్లు అమర్చారు. జిల్లా లో మొత్తం అందుబాటులో ఉన్న పడకలు బెడ్లు 160 కాగా, ఆక్సిజన్ సరఫరా ఉండే బెడ్స్ 135 సిద్ధం చేశారు.