జగిత్యాల, జనవరి 19 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి జంక్షన్: కరోనా, ఒమిక్రాన్ వేరియంట్లను పూర్తిగా అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. రెండో డోస్ వ్యాక్సినేషన్, కొవిడ్ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై జగిత్యాల, పెద్దపెల్లి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్లో మినిస్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమీక్షించి, తక్కువగా నమోదవుతున్న మండలాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ అంశంపై జిల్లాలో టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పా టు చేసి ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ధర్మపురి, మల్యాల, జూలపల్లి, రాగినేడు, శ్రీరాంపూర్ పీహెచ్సీలో తక్కువ శాతం వ్యాక్సినేషన్ నమోదైందని, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉందని, జిల్లాలో వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న మందుల వివరాలు, హోం ఐసొలేషన్ కిట్స్ వంటి వివరాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మేర ఆర్డర్ పెట్టుకోవాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనుకాడే వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందుండే జగిత్యాల జిల్లాను వ్యాక్సినేషన్లో ప్రథమ స్థానంలో నిలుపాలని కోరారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ రవి
జిల్లాలో 7,58,757 మందికి వ్యాక్సినేషన్ లక్ష్యం కాగా, మొదటి డోస్ వంద శాతం, రెండో డోస్ 75శాతం పూర్తి చేశామని జగిత్యాల కలెక్టర్ రవి చెప్పారు. 51,979 మందికి రెండో డోస్ వేయాల్సి ఉందన్నారు. పండుగల సందర్భంగా వ్యాక్సినేషన్ తక్కువగా నమోదైందని, రెండో డో స్ వేసుకునే వారిని గుర్తించి నిర్ణీత సమయలో వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 15-17 ఏండ్ల వయసు ఉన్న వారికి 45 శాతం వ్యాక్సిన్ వేశామన్నారు. ప్రతి రోజు గ్రామాల్లో ఏఎన్ఎంలు, మహిళా సంఘా లు, అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా ఫీవర్ సర్వే చేసి, వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వీసీలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు డా.సంజయ్, రవిశంకర్, జిల్లా వైద్యాధికారి శ్రీధర్ ఉన్నారు.
వందశాతం పూర్తి చేస్తాం: కలెక్టర్ సంగీత
జిల్లాలో మొదటి డోసు 5,93,000 మందికి వ్యాక్సినేషన్ లక్ష్యం కాగా, 6 లక్షల మందికి వేసి 102 శాతం పూర్తిచేసినట్లు పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు. రెండో డోసు 72శాతం పూర్తయిందని, వందశాతం పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 15 -18 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలకు 56 శాతం వాక్సినేషన్ చేశామని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిసి 626 కొవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 41 మంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారని చెప్పారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడారు. జూలపల్లి, రాగినేడు, కాల్వ శ్రీరాంపూర్ పీహెచ్సీ పరిధిలో వ్యాక్సినేషన్ తక్కువ నమోదైందని, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జూమ్ మీటింగ్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ ఉన్నారు.