మన్సూరాబాద్ : నిరుపేదల కుటుంబాలలో జరుగుతున్న వివాహాలకు ఉప్పల ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా పుస్తె, మట్టెలు, చీర, గాజులను అందించే సాంప్రదాయం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు.
సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, బొప్పాపూర్ గ్రామానికి చెందిన గుండవెల్లి యాదమ్మ కూతురు లావణ్య వివాహం ఇటీవల నిశ్చయమైంది. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేదింట్లో జరుగుతున్న వివాహానికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు.
నాగోల్లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదమ్మ కూతురు లావణ్య వివాహానికి పుస్తె, మట్టెలు, చీర, గాజులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ఫౌండేషన్ సంస్థ కో చైర్పర్సన్ ఉప్పల స్వప్న, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దేవరాజ్, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.