టీబీజీకేఎస్ సహా ఏకమైన జాతీయ సంఘాలు
డిసెంబర్ 9నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సుముఖత
బీజేపీ ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం ఆగదని కార్మిక సంఘాల స్పష్టీకరణ
గోదావరిఖని, నవంబర్ 29: కేంద్రంపై సింగరేణి కార్మిక లోకం పోరుబాట పడుతున్నది. బొగ్గు బ్లాకుల వేలం రద్దుకు యుద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాలన్నీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లెందు క్లబ్లో సోమవారం ఏకమై, వచ్చే నెల 9 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించాయి. సమ్మెలో డిమాండ్లు మరిన్ని చేర్చడంతోపాటు వేలం రద్దుకు బీజేపీ సర్కారు దిగివచ్చే దాకా పోరాటం చేయాలని సంకల్పించాయి. ఇప్పటి నుంచే ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకుంటున్నాయి.
కార్మిక సంఘా లు ఏకమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు పై పోరుబాట పట్టాయి. సింగరేణిలో నాలుగు బొ గ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసే దాకా పోరాటం చే యాలని నిర్ణయించాయి. సోమవారం గోదావరిఖ ని పట్టణంలోని సింగరేణి ఇల్లందు గెస్ట్హౌస్లో టీబీజీకేఎస్తో జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, సీఐటీ యూ, బీఎంఎస్కు చెందిన ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులంతా ముక్తకంఠంతో కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని నిర్ణయించారు. సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు కల్యాణఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బా ్లక్-3, శ్రావణ్పల్లి బ్లాక్లను వేలం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తున్న చర్యలను టీబీజీకేఎస్తో పాటు 5 జాతీయ కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. డిసెంబర్ 9 లేదా ఆ తర్వాత నుంచి జరిగే సమ్మెకు కార్మిక వర్గాన్ని సమాయత్తం చేయడానికి, ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్ణయించాయి. దీనికి గాను సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సంపూర్ణంగా సమ్మెలోకి వెళ్లే విధంగా అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా కృషి చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. డిసెంబర్ 9నుంచి సమ్మె చేయడానికి అందరూ సిద్ధమని ఈ సందర్భంగా నిర్ణయించారు. టీబీజీకేఎస్ ఇచ్చిన సమ్మె నోటీసులోని డిమాండ్లతో పాటు మరికొన్ని డిమాండ్లను చేర్చి యాజమాన్యానికి మరో నోటీసు జారీ చేయాలని కొన్ని కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణిలోని కార్మిక సంఘాలన్ని ఐక్యంగా ముందుకు సాగడంతో సింగరేణి బ్లాకులను కాపాడుకునే అవకాశం ఏర్పడుతోందని భావిస్తున్నారు. సోమవారం జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్కు చెందిన ముఖ్య నాయకులు బీ వెంకట్రావ్, మి ర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఆహ్మద్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.