బంజారాహిల్స్ : నగరానికి కొత్తగా వచ్చిన తనకు ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడి ఇంటికి కన్నం వేసి ఉడాయించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న పోతల కుమార్ అనే వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల విశాఖపట్నం ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు శీలమ్రాజ్ అనే వ్యక్తి భార్యతో కలిసి నగరానికి వచ్చాడు. తాము వారంరోజుల్లో గది అద్దెకు తీసుకుంటామని, అప్పటిదాకా మీ ఇంట్లో ఉంటామని చెప్పారు. దీనికి అంగీకరించిన కుమార్ వారికి తన గదిలో ఆశ్రయం కల్పించాడు.
ఇదిలా ఉండగా ఈనెల 14న పనిమీద కూకట్పల్లికి వెళ్తున్నానని చెప్పిన కుమార్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిచూడగా శీలమ్ రాజ్ కనిపించలేదు. గదిలో ఉండాల్సిన రెండు ల్యాప్టాప్స్, సుజుకీ యాక్సెస్ బైక్ (ఏపీ 39ఏటీ 8413) కనిపించలేదు.
మరుసటిరోజు ఉదయం కుమార్ బ్యాంకు అకౌంట్లో నుంచి రూ.1.70లక్షలు శీలమ్రాజ్ అకౌంట్లోకి వెళ్లినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా తన బ్యాంకు ఖాతాతో అనుసంధానమయిన ఫోన్ నెంబర్ నుంచి డబ్బులు శీలమ్రాజ్ అకౌంట్లోకి వెళ్లినట్లు తేలింది.
తన గదిలో ఉండాల్సిన సిమ్ కార్డును తస్కరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించిన బాధితుడు తన స్నేహితుడు శీలమ్రాజ్ ల్యాప్టాప్లు, బైక్ను చోరీ చేయడంతో పాటు బ్యాంకు ఖాతానుంచి డబ్బులు కాజేశాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ 380 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.