చార్మినార్ : ఇండ్లల్లో చోరీలు చేస్తే రొటీన్ అనుకున్నారో లేదా కరోనా కేసులు ప్రబలుతున్న సమయంలో రక్షణ కోసమని భావించారో గాని పాతనగరంలోని ఓ పీహెచ్సీలో దూరిన దొంగలు కరోనా టీకాల బాటిళ్లను ఎత్తుకెళ్లారు. మీర్ చౌక్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలికబర్ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొనసాగుతుంది.
శనివారం విధులు ముగించుకుని తాళం వేసి వెళ్లిన ఆసుపత్రి సిబ్బంది సోమవారం తిరిగి విధులకు వచ్చే సరికి పీహెచ్సీ కేంద్ర తలుపులు తెరిచి, తాళం విరిగిపడి ఉన్న విషయాన్ని గుర్తించారు. కేంద్రంలోకి వెళ్లి చూడగా చికిత్సల కోసం వచ్చే వారి వివరాలను నమోదు చేసే కంప్యూటర్ మానిటర్లతోపాటు రెండు సీపీయూలు కీబోర్డులు ధ్వంసమై ఉన్నాయి.
ఆసుపత్రిలో భద్రపర్చిన కొవాగ్జిన్ 17 వయల్స్ కోవిషీల్డ్ 27 వయల్స్లను దొంగలు ఎత్తుకెళ్లారని గుర్తించారు. ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన టీవిని ధ్వంసం చేసిన దొంగలు బీసీజీ 22, ఓపివి 44, డీపీటీ 15, ఐపీవీ7, హెపాటీబీ 39, ఎంఆర్ 38, పీసీపీ 7, పెంటా 23, డీటీ 21, ఏఈఎఫ్పై 2 కిట్లను కూడా చోరులు అపహరించారు.
చోరీ జరిగిన విషయాన్ని ఆసుపత్రి వైద్యులు లింగమూర్తి మీర్ చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించామని ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపారు.