బంజారాహిల్స్ : అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి బంజారాహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలోని వంశీరామ్ జ్యోతి లోటస్ అపార్ట్మెంట్లో బి.చంద్రశేఖర్ అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 25న రాత్రి 10గంటల ప్రాంతంలో భోజనం ముగించుకుని నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయం 7.30 ప్రాంతంలో నిద్రలేచి చూడగా బ్యాక్డోర్ తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. ఆందోళనకు గురయిన చంద్రశేఖర్ అన్ని గదుల్లో పరిశీలించగా తన అత్తకు చెందిన గదిలో కొన్ని ఆభరణాలు మాయమయినట్లు తేలింది.
4తులాల మంగళసూత్రం, బంగారు గాజు సహా కొన్ని వస్తువులు మాయమయినట్లు గుర్తించిన చంద్రశేఖర్ ఇంట్లో వారిని ఆరా తీయగా ఫలితం దక్కలేదు. దీంతో సుమారు రూ.1.3లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఆదివారం బాదితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.