గద్వాల టౌన్/అయిజ, జనవరి 12 : చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఏటా 24 ఏకాదశిలు వస్తాయి. అందులో సూర్యగమనం ప్రకారం ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రత ఏకాదశి అని పిలుస్తారు. శ్రీహరికి ఇష్టమైన ప్రదేశం వైకుంఠం. ఇష్టమైన తిథి ఏకాదశి. అలాంటి ఏకాదశుల్లో అత్యంత ప్రాధాన్యమున్నదే వైకుంఠ ఏకాదశి. సర్వధామం, ముక్కోటి ఏకాదశి అని పిలిచే ఈ ఏకాదశిని అన్ని వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి.
ఉత్తర ద్వార దర్శనం.. మోక్షదాయకం..
మహావిష్ణువుకు ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామి వారిని దర్శించుకుంటే మోక్షదాయకమని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు వైకుంఠ సప్తద్వారాలు తెరుచుకుంటాయి. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారంగా భావించి వేకువజాము నుంచే భగవత్ దర్శనార్థం భక్తులు నిరీక్షిస్తారు. మహావిష్ణువు గరుడ వాహనదారుడై ముక్కోటి దేవతలతో కలిసి భూమికి దిగివచ్చి దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. సూర్యోదయానికి ముందే స్నాన, సంధ్యాదులు పూర్తి చేసుకొని ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటే పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారని నమ్మకం.
ఏర్పాట్లు పూర్తి..
ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో టీఆర్ఎస్ నేత తిరుమల్రెడ్డి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం వేకువజామున 4:30 గంటలకు దివ్యమైన ముహూర్తంలో ఉత్తర ద్వార బంధనాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య తెరిచి భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, తోమాలసేవ, ఉత్తర ద్వార ప్రవేశ పూజ, కవాటోద్ఘాటనం (ఉత్తర ద్వారం తలుపులు తెరుచుట) ప్రవేశం, బిందెసేవ, పంచామృతాభిషేకం, సేవాకాలం, బలిహరణ, నివేదన, మహా మంగళహారతి, విశ్వరూప సందర్శన, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల కు శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వరస్వా మి కల్యాణం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల కు ఉత్తర ద్వార కవాట బంధనం ఉంటుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లాతోపాటు కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు అశేష సంఖ్యలో తరలిరానున్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని దేవస్థాన కమిటీ తెలిపింది. మాస్క్ తప్పనిసరిగా ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరింది. ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా వైష్ణవ ఆలయాలైన కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి, బుర్ధాపేటలోని గోదారంగనాథ స్వామి, పెద్ద అగ్రహారంలోని లక్ష్మీనృసింహ స్వామి, గంజిపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు పాగుంట వేంకటేశ్వరస్వామి, బీచుపల్లి ఆంజనేయ, రామాలయం, మల్దకల్ తిమ్మప్ప ఆలయం, అలంపూర్లోని వైష్ణవ ఆలయాల్లో ఉదయం 4 గంటల నుంచే విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. అలాగే తిరుప్పావై పారాయణం, పొంగళి నివేదన, ఆర్తి, గోష్ఠి కార్యక్రమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయిజ మండలంలోని ఉత్తనూరు గ్రామంలో జనమే జయ మహారాజు మునిమనవడు అర్జునుడుచే ప్రతిష్ఠించిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, పట్టణంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్ప, మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి, రాజపురం, తుపత్రాల గ్రామాల్లోని గుంటి రంగనాథస్వామి దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశిని
ఘనంగా నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం..
కృత యుగంలో చంద్రావతి నగర రాజధానిగా మురాసురుడనే రాక్షసుడు పాలించేవాడు. బ్రహ్మదేవుడి వరంతో మురాసురుడు మహారుషుల యజ్ఞాలను ధ్వంసం చేసేవాడు. దేవతలను కూడా వేధించేవాడు. దీంతో దేవతలంతా కలిసి విష్ణువుతో మొరపెట్టుకున్నారు. ఈ మేరకు మహావిష్ణువు రాక్షసుడిపై యుద్ధానికి బయలుదేరాడు. కానీ అతడిని సంహరించడం విష్ణువు వల్ల సాధ్యం కాలేదు. అలిసిపోయిన హరి బదరికా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటుండగా స్వామి శరీరంలో నుంచి ఏకాదశి కన్య ఉద్భవించి మురాసురుడితో యుద్ధం చేసి వధించింది. కన్య ధైర్యాన్ని మెచ్చుకున్న స్వామి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. ‘తన పేరుమీద భక్తి శ్రద్ధలతో ఏకాదశి రోజున వ్రతం ఆచరించి శ్రీమన్నారాయణుడిని కొలుస్తారో వారికి మోక్షం కలిగించి వైకుంఠ ప్రాప్తి కలిగించాలి’ అనికోరుకుంటుంది. అందుకే భక్తులు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తారు.