కోడేరు, జనవరి 12 : భక్తుల కోరిన కోరికలు తీర్చే మహిమగల దేవుడిగా ఎత్తం రామలింగేశ్వరస్వామి పూజలు అందుకుంటున్నాడు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడే రు మండలం, ఎత్తం గ్రామ శివారులోని ఎత్త గట్టు పై వెలసిన రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 13, 14, 15 తేదీల్లో అత్యంత వైభవంగా వేడుక లు నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ సం దర్భంగా వరుసగా మూడు సార్లు ఎత్తం గట్టు ఎక్కి తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. సుమా రు 450 ఏండ్ల కిందట జయలక్ష్మారెడ్డి అనే సంస్థానాధీశుడు ఎత్తం గ్రామానికి సమీపంలో ఉన్న కల్వకోలులో నందికోటను నిర్మించి ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. మిగతా తెలంగాణ సంస్థానాధీశులకు వైరిగా ఉండడంతో జయలక్ష్మారెడ్డిని హతమార్చారు. అతడి మరణానంతరం పాన్గల్ ఖిల్లా ను ఏలుతున్న అల్లాఉద్దీన్ ఎత్తం, కల్వకోలును స్వాధీనం చేసుకొని తన మిత్రుడైన కరణం నారాయణరావుకు భుక్తిగా ఇచ్చి సత్కరించారు. అతను రామభక్తుడు కావడంతో ఎత్తం గ్రామానికి సమీపంలోని గట్టుపై శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించా రు. కోడేరు నుంచి కొల్లాపూర్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఎత్తం గ్రామ శివారులో సుమారు 2 వేల అడుగుల ఎత్తు కలిగిన గుట్టపై బండరాళ్లతో ఏర్పాటు చేసిన చిన్న గుడిలో రామలింగేశ్వరస్వా మి లింగ రూపంలో ఉండి విష్ణువు నామాలు, క ళ్లు, కిరీటం, వెండి అభరణాలతో శివకేశవ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఏటా మకర సంక్రాతిని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. భోగి మరుసటి రోజున స్వామి వారికి తమ మొక్కులను చెల్లించుకునేందుకు వివి ధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండమీదికి చేరుకుంటారు. రాత్రి వేళల్లో కొండపై వెలిగించే మకరజ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. పూర్వం రామభక్తులైన హనుమదాసు, వెంకటదాసులు స్వామిని దర్శించి స్వామిపై కీర్తనలు రచించారు.
చరిత్ర..
పూర్వం యతులు (సన్యాసులు) ఈ పర్వతంపై తపస్సు చేసినందున యతులగట్టు అని పిలిచేవా రు. కాలక్రమేణా ఎత్తం గట్టుగా మారిందని చర్రిత ప్రకారం తెలుస్తున్నది. రామాయణ కాలంలో శ్రీ రాముడు వనవాసం చేసే సమయంలో ఈ పర్వతంపైకి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారని.. అక్కడి దై వం లింగ రూపంలో ఉండడంతో ఎత్తం రామస్వామిగా భక్తులు కొలుస్తున్నారని పురావస్తుశాఖ అధికారులు తెలుపుతున్నారు.
ఇలా వెళ్లాలి..
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో ఎత్తం గట్టు ఉన్నది. కోడేరు మండలకేంద్రం మీదుగా కొల్లాపూర్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఎత్తం గట్టు శిఖరంపై ఈ ఆలయాన్ని బండరాళ్లతో ఏర్పాటు చేశారు. కొల్లాపూర్కు కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. కోడేరు నుంచి కొల్లాపూర్ వెల్లే రోడ్డుకు అతి సమీపంలో ఉంది. ప్రధాన రోడ్డునుంచి వ్యవసాయ పొలాలగుండా గట్టు వద్దకు చేరుకోవచ్చు. మెయిన్ రోడ్డునుంచి గట్టు వద్దకు రోడ్డు సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.