ఇతర, వాణిజ్య పంటల సాగు రైతులకు కోతుల బెడద పొంచి ఉన్నది. పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం కోతుల లెక్క తేల్చేందుకు ముందుకొచ్చింది. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు దాదాపు 15 రోజులపాటు కోతుల గణన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని కోతులు ఉన్నాయి.? ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి.? ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి.? ఎన్ని గుంపులు తిరుగుతున్నాయి.? పంటలకు కలిగే నష్టాలు, రైతులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై జిల్లా వ్యవసాయశాఖ ప్రత్యేక డైవ్ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2,412 కోతుల గుంపులు ఉన్నాయని, మొత్తం 2,64,522 కోతులు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వ్యవసాయశాఖకు సంబంధించిన పోర్టల్లో కోతుల సంఖ్యను పొందుపరిచి పూర్తి నివేదికను రాష్ట్ర సర్కార్కు అందజేశారు.
ఖమ్మం, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, వాణిజ్య పంటలపై కోతులు దాడి చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కోతుల గణనకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎన్ని కోతులు ఉన్నాయి.? ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి.? ఎన్ని గుంపులుగా విడిపోయి తిరుగుతున్నాయి.? పంటలకు కలిగే నష్టాలు, రైతులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై జిల్లా వ్యవసాయశాఖ ప్రత్యేక డైవ్ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించింది.
15 రోజులపాటు సర్వే
వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రజలు, రైతుల సహకారంతో దాదాపు పక్షం రోజులపాటు గ్రామాల్లో కోతుల గణన చేపట్టారు. పంట పొలాలు, గ్రామాల్లో తిరిగి కోతులు రాత్రి వేళల్లో ఎక్కడ ఉంటున్నాయి. ఉదయం తిరిగి ఆహారం కోసం పంట పొలాలకు ఎన్ని వెళ్తున్నాయి. ఇండ్ల పరిసర ప్రాంతాలకు ఎన్ని వస్తున్నాయనే దానిపై సర్వే చేపట్టారు. వ్యవసాయశాఖకు సంబంధించిన ఫోర్టల్లో కోతుల సంఖ్యను పొందుపరిచారు. అనంతరం పూర్తి నివేదికను రాష్ట సర్కార్కు అందజేశారు.
జిల్లా వ్యాప్తంగా 2,64,522 కోతులు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2,412 కోతుల గుంపులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ గుంపుల్లో మొత్తం 2,64,522 కోతులున్నట్లు తేల్చారు. రైతులు పంటలను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను సైతం సర్వేలో పొందుపరిచారు. పంట పొలాల నుంచి ఇతర పొలాలకు తరిమేయడం, ఒడిసెల, కొండముచ్చుల సహాయంతో పొలాల నుంచి బయటకు పంపించడం, కోతుల గుంపులపైకి కుక్కలను ఉసిగొల్పి పంటను కాపాడుకుంటున్నట్లు సర్వేలో తేలింది. వాటి స్థావరాలను గుర్తించి నివేదికలో పొందుపరిచారు. ఇక నుంచి ఇతర పంటలకు కోతుల నుంచి విముక్తి కల్పించేందుకు సర్కార్ చర్యలు చేపట్టనున్నది. జిల్లాలో కోతుల సంఖ్య నిర్ధారణ అయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
మండలాల వారీగా కోతుల గుంపులు,
కోతుల సంఖ్య ఇలా..
అధికారుల సర్వే ప్రకారం జిల్లా వ్యాప్తంగా 2,412 గుంపులు కాగా, వాటిలో మొత్తం 2,64,522 కోతులు ఉన్నట్లు తేలింది.