ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైష్ణవాలయాల్లో వైకుంఠ వైభవం సాక్షాత్కరించింది. యాదాద్రి లక్ష్మీనరసింహుడు వైకుంఠనాథుడిగా బాలాలయం తూర్పుద్వారం గుండా దర్శనమిచ్చారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండ రామగిరి సీతారామచంద్రస్వామి, సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి, మట్టపల్లి, వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారంలో ఇష్టదైవాన్ని కనులారా వీక్షించి తరించారు. మరోవైపు యాదాద్రీశుడి అధ్యయనోత్సవాలు మొదలయ్యాయి. తొలిరోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ముక్కోటి ఏకాదశిన మూడు కోట్ల దేవతలు మెచ్చేలా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉమ్మడి జిల్లాలో వైభవంగా జరిగాయి. పలు ఆలయాల్లో స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ఉప్పొంగిన భక్తితో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో వైష్ణవాలయాలు కిటకిటలాడాయి. యాదాద్రి ప్రధానాలయంలోని బాలాలయంలో స్వామివారు వైకుంఠనాథుడిగా తూర్పు ద్వారం గుండా, పాతగుట్టలో ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. నల్లగొండలోని
రామగిరిలో గల రెండో భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవాలయంతోపాటు పానగల్లోని పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయం, వీటీకాలనీ, ఆనంద్నగర్, డీవీకే రోడ్డు, బీటీఎస్లోని వేంకటేశ్వరస్వామి ఆలయల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. దామరచర్ల, వీర్లపాలెంలోని కోదండ రామాలయాల్లో, వాడపల్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలు, వేదాంత భజన మదిరం, భగవద్గీత మందిరాల్లో ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు దీరారు. మట్టపల్లి లక్ష్మీనరసింహ, వేణుగోపాలస్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.