దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన మహత్తర పథకం దళితబంధు. హుజురాబాద్లో అమలైన దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట నియోజకవర్గానికి వంద దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా నియోజకవర్గంలోని దళితులందరికీ పథకం వర్తింపజేస్తారు. దళిత కుటుంబాల రూపురేఖలు మార్చే దళితబంధు పథకం త్వరలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ అమలుకానున్నది. దీనికి సంబంధించి ఆదివారం మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో సంగారెడ్డి జడ్పీలో కీలక సమావేశం జరుగనున్నది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దళితబంధు అమలుతో సొంత కాళ్లపై దళితులు నిలబడి ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంది.
సంగారెడ్డి, జనవరి 22(నమస్తే తెలంగాణ) : దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టిన మహత్తర పథకం దళితబంధు ఉమ్మడి మెదక్ జిల్లాలో త్వరలోనే అమలు కానున్నది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఆదివారం సంగారెడ్డి జడ్పీలో దళితబంధు పథకం అమలుపై ఉదయం 11 గంటలకు సన్నాహక సమావేశం జరుగనున్నది. కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి, మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, తదితరులు హాజరు కానున్నారు. వీరితో పాటు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, ఇద్దరు అదనపు కలెక్టర్లు, అన్ని ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. దళితబంధు పథకం అమలు, లబ్ధిదారులు ఎంపిక తదితర అంశాలపై మంత్రి హరీశ్రావు ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలుపై కార్యాచరణను రూపొందించనున్నారు. సమావేశం ఏర్పాట్లపై శనివారం కలెక్టర్ హనుమంతరావు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. జిల్లా అధికారులంతా తమశాఖలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం, నివేదికలతో రావాలని తెలిపారు.
దళితబంధుతో దళితుల సాధికారత…
సీఎం కేసీఆర్ దళితులకు సాధికారత దక్కాలన్న సంకల్పంతో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. మొదట 2021 బడ్జెట్లో ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం’ పేరుతో రూ.1000 కోట్లను కేటాయించారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలో ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం’ బడ్జెట్ కేటాయింపుల గురించి వివరించారు. గతేడాది జూలైలో సీఎం కేసీఆర్ దళిత సాధికారతపై దళిత ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, దళితబంధు పథకాన్ని ప్రకటించారు. వాసాలమర్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో గత ఏడాది సెప్టెంబర్ 14న ప్రారంభించి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. దీంతో లబ్ధిదారులు ట్యాక్సీ కార్లు, డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు ఇలా తమకు నచ్చిన రంగాలను ఎంచుకుని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. హుజురాబాద్లో విజయవంతమవడంతో దళితబంధు పథకాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, పైలెట్గా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నియోజకవర్గానికి వందమంది లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం వర్తింపజేయనున్నారు. దళితబంధు పథకంతో పాటు లబ్ధిదారుల రక్షణ కోసం ప్రత్యేకంగా రక్షణ నిధి ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.
భిన్నమైన యూనిట్లకు అవకాశం…
దళితబంధు లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చు. సంగారెడ్డి జిల్లాలో ఎంపికయ్యే లబ్ధిదారులు భిన్నమైన యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రూ.10 లక్షలతో కారు, ట్రాక్టర్, హార్వెస్టర్ కొనుగోలు చేసుకోవచ్చు. వ్యవసాయ, అనుబంధ రంగాలైన పౌల్ట్రీ, డెయిరీ రంగాలకు సంబంధించిన యూనిట్లను నెలకొల్పవచ్చు. జహీరాబాద్ సమీపంలో హాట్సన్ డెయిరీ కంపెనీ ఉంది. ఇక్కడి లబ్ధిదారులు సమిష్టిగా డెయిరీ యూనిట్ను ఏర్పాటు చేసుకొని, హాట్సన్ కంపెనీకి పాలు, పాల ఉత్పత్తులను విక్రయించి లాభాలు పొందవచ్చు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరు నియోజకవర్గంలోని లబ్ధిదారులు కంపెనీలకు అనుబంధంగా చిన్నచిన్న పరికరాల తయారీ యూనిట్లను పెట్టుకోవచ్చు. సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల వారు వ్యవసాయ అనుబంధ, వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదగవచ్చు.
దళితులకు బంగారు బాట…
దళితబంధు పథకం సంగారెడ్డి జిల్లాలోని దళితులకు బంగారుబాట కానున్నది. పథకంలో భాగంగా కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.10 లక్షల నగదు జమ చేస్తుంది. ఈ డబ్బుతో లబ్ధిదారులకు తమకు నచ్చిన, స్వయం ఉపాధి కల్పించే ఏదైనా యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం, అధికారులు యూనిట్లకు సంబంధించి తగిన సూచనలు అందజేస్తారు. కాగా, జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు, అందోలు ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వంద చొప్పున 500 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి మంత్రి హరీశ్రావు నేతృత్వంలో నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు ఎక్కడైనా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 2,71,971 మంది దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. జహీరాబాద్ నియోజకవర్గంలో 72287, అందోల్లో 51126, సంగారెడ్డిలో 50612, పటాన్చెరులో 48,725, నారాయణఖేడ్లో 43,028 మంది దళితులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.