నల్లగొండ ప్రతినిధి, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : బీజేపీది పూర్తిగా రైతు వ్యతిరేక ఎజెండా అని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులకు గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బీజేపీ ఏడేండ్ల పాలనలో అన్నీ రైతు వ్యతిరేక విధానాలను తీసుకుందని ఆరోపించారు. అధికారంలోకొచ్చిన కొత్తలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోడీ చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలాయని, కేవలం దళారుల ఆదాయాన్నే పెంచారని విమర్శించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన విధానాలతో తెలంగాణలో రైతుల ఆదాయం పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి తెలంగాణ రైతు జేబుకు చిల్లు పెడుతుందని పేర్కొన్నారు. బీజేపీ వైఖరి దొంగే దొంగా.. దొంగా.. అన్న చందంగా మారిందని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సమాధానం చెప్పాల్సిన మోడీ మౌనం వహిస్తుండడం దారుణమని పేర్కొన్నారు. పైగా రాష్ట్ర బీజేపీ నేతలతో ఊరకుక్కల్లా మొరిగిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు మోడీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాల సంగతేమో గానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న మోడీ సర్కార్ వల్ల దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను తన తాబేదాైైర్లెన కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ దేశసంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నల్లధనం తెస్తామన్న ప్రధాని మోదీ ప్రస్తుతం పేదల జేబులకు చిల్లులు పడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీజేపీ అధికారంలోకొచ్చాక అదానీ, అంబానీల ఆస్తులు పెరిగిపోగా, పేదలు మాత్రం మరింత పేదలుగా మారుతున్నారని పేర్కొన్నారు. రైతాంగం నోట్లో మట్టికొట్టేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రైతుల ఆగ్రహానికి భయపడినట్లు నటించిన మోదీ సర్కార్ తిరిగి అవే చట్టాలను దొడ్డిదారిలో అమలుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర సర్కార్ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రం పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే వరకు ప్రజలు, రైతాంగం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు కేంద్రంపై పోరాటంలో ముందుండి ప్రజలను నడిపించాలని పిలుపునిచ్చారు.