కోడేరు, జనవరి 16: మండలంలోని ఎత్తం గ్రామ శివారులోని ఎత్తం గట్టుపై వెలిసిన రామలింగేశ్వరస్వామి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎత్తం గట్టుపై వెలిసిన రామలింగేశ్వరస్వామి ఆలయంలో 13, 14,15 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యంత ఎతైన ఎత్తం గట్టుపై కొలువుదీరిన రామలింగేశ్వరస్వామి వద్దకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలనుంచి శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దాదాపుగా లక్షమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులను చెల్లించుకున్నారు. ఎత్తం గ్రామ శివారులోని గట్టుపై స్వామి ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించారు. భక్తులు స్వామికి కొబ్బరికాయ కోరమీసాలు సమర్పించారు. స్వామి వద్దకు వెళ్లేందుకు బండరాళ్లపై పాకుతూ భక్తులు చేరుకున్నారు. ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శంచుకున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. కొందరు భక్తులు కోడేరు వైపున ఉన్న ముఖద్వారం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. గట్టుకింద ఆంజనేయస్వామి ఆలయం వద్ద భక్తులు ముందుగా దర్శనం చేసుకొని గట్టుపైకి ఎక్కారు. కోడేరు, ఎత్తం గ్రామాలకు చెందిన భక్తులు గట్టుపైకి ఎక్కిన భక్తులకు ఉచితంగా అన్నదానం చేశారు. కోడేరుకు చెందిన ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కోడేరుకు చెందిన ఉపాధ్యాయులు మానవపాడు రాములు, బద్దుల రామకృష్ణ, తుమ్మల బాలపీరు, బింగి మహేశ్, తిప్ప వెంకటేశ్, చిట్టిగొండ మల్లేశ్, గోసుల కృష్ణ, బద్దుల నిరంజన్ తమ సొంత ఖర్చులతో అన్నదానం చేశారు.