అడ్డగుట్ట : ప్రతి పేదవాడికి అధునాతనమైన ఖరీదైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్లోని దూద్బావి ప్రాంతంలో బస్తీ దవాఖానను ప్రారంబించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ… నగరవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 226 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అర్బన్ హెల్త్ సెంటర్లకు అదనంగా ఏ వైద్య సేవలు అందుబాటులో లేని బస్తీలను ప్రత్యేకంగా గుర్తించి బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.
రక్త పరీక్షల వంటి సాధారణ వైద్య పరీక్షల నుంచి ఈసీజీ/ఎమ్ఆర్ఐతో పాటు ఏకంగా 108 రకాల విలువైన వైద్య సేవలను పూర్తిస్థాయిలో ఉచితంగా అందించేందుకు డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాలను నగరవ్యాప్తంగా ప్రారంబిస్తున్నామని, ప్రజలు వాటిని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు పకడ్భంది చర్యలు చేపడుతుందని, అందులో భాగంగానే ఖరీదైన వైద్యం ప్రజలకు అందేల చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవీందర్ గౌడ్, తెరాస యువ నేతలు రామేశ్వర్ గౌడ్, కిషోర్ గౌడ్తో పాటు తదితరులు పాల్గొన్నారు.