మాదాపూర్ : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ. 404.71 కోట్లతో ఎస్టీపీ నిర్మాణ పనులు మంజూరుకాగా సోమవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ. 26.27 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించబోయే ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధి కేంద్రాలు) శంఖుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి చెవెళ్ళ ఎంపీ రంజిత్రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, వి. జగదీశ్వర్గౌడ్, పూజిత గౌడ్, మంజుల రఘునాథ్రెడ్డి, సాయిబాబ, నార్నె శ్రీనివాస్లు హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తు మౌలిక వసతులను కల్పిస్తుందని ఆయన తెలిపారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ … ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలనీల్లో తాగునీటి సరఫరా, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరదనీటి కాలువ అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మరికొన్ని చోట్ల మంజూరయిన నిధులతో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తున్నామని అన్నారు. జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న 772 ఎంఎల్డి సీవరేజ్ ప్లాంట్లకు అదనంగా 1260 ఎంఎల్డి సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినేట్ అనుమతి ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగానే 31 ప్రాంతాల్లో సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఎస్టీపిల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను కోరారు. అనంతరం అధికారులకు ఎస్టిపిల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని పలు సలహలు, సూచనలు చేశారు.