అతివేగం, మద్యం మత్తు, నిద్రలేమి తదితర కారణాలతో సంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే-65 నిత్యం రక్తమోడుతున్నది. జహీరాబాద్ బైపాస్ రోడ్డులోని బుచినెల్లి శివారు నుంచి హుగ్గెల్లి చౌరస్తా వరకు అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది గాయాలపాలు కాగా, ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. బైపాస్ పక్కనే అనేక వెంచర్లు ఏర్పాటుచేయడం, అక్కడికి వెళ్లేందుకు అనుమతులు తీసుకోకుండా లింక్ రోడ్లను నిర్మించడం కూడా ప్రమాదాలకు కారణమని వాహనదారులు పేర్కొంటున్నారు. వెంచర్ల నుంచి ఒక్కసారిగా వాహనాలు హైవేపైకి వస్తుండడంతో తరుచూ యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయని అంటున్నారు. అధికారులు బ్లాక్ స్పాట్స్ను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బైపాస్ నుంచి వెంచర్లకు అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్లను మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జహీరాబాద్, జనవరి 12 : డ్రైవర్ల నిర్లక్ష్యం..నిద్రలేమి.. అతివేగం..మద్యం తాగి వాహనాలు నడపడం కారణాలతో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్తున్న 65వ జాతీయ రహదారి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. ముంబయి- హైదరాబాద్ రోడ్డుపై జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ప్రమాదాలు జరుగుతుండడంతో అనేక మందికి తీవ్రగాయాలు కావడం, కొందరు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. 5 కిలోమీటర్ల పొడవున్న ఈ బైపాస్ రోడ్డులో బుచినెల్లి శివారు నుంచి హుగ్గెల్లి చౌరస్తా వరకు అధికంగా ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం జహీరాబాద్-బీదర్ రోడ్డుపై ప్రమాదం జరిగి నలుగురు చనిపోగా, ఆదివారం ఉదయం జహీరాబాద్ బైపాస్ రోడ్డులో నిలిచి ఉన్న క్రేన్ వాహనాన్ని ముంబయి నుంచి వస్తున్న కారు ఢీ కొట్టడంతో హైదరాబాద్కు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలైన సంగతి విధితమే. అయితే, మద్యం మత్తులో వాహనాలు నడపడం, నిద్రలేకపోవడంతోనే తెల్లవారుజామున ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.
బైపాస్ రోడ్డులో అధికంగా ప్రమాదాలు…
జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరగడంతో ప్రభుత్వం కొత్తగా 65వ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మాణం చేసి, బైపాస్ రోడ్డును అందుబాటులోకి తెచ్చింది. అయితే, బైపాస్ రోడ్డుకు సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో పలువురు రియల్ వ్యాపారులు రోడ్డు పక్కన వెంచర్లు ఏర్పాటు చేశారు. జాతీయ రోడ్డు నిబంధనలు ప్రకారం బైపాస్ రోడ్డుకు ఎలాంటి లింక్ రోడ్ల నిర్మాణం చేయకూడదు. కాగా, రియల్ వ్యాపారులు జాతీయ రహదారి నిర్వహణ అధికారులతో కలిసి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే వెంచర్లకు రోడ్లు నిర్మించారు. ముంబయి – హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా తిరగడం.. వెంచర్లకు వేసిన రోడ్లకు సంబంధించి ఎలాంటి గుర్తులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హుగ్గెల్లి చౌరస్తా నుంచి బుచినెల్లి చౌరస్తా వరకు వెంచర్లు ఉండగా, ఎక్కడా రోడ్లు వేసేందుకు ప్రభుత్వ అనుమతి లేదని సమాచారం. అలాగే, రహదారి పక్కన వరద నీరు వెళ్లేందుకు కాల్వలు ఉన్నా వెంచర్ నిర్వాహకులు వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేసినా ఎవరూ స్పందించడం లేదు. దీంతో వరద ప్రవాహానికి రోడ్డు కోతకు గురవుతున్నది.
బ్లాక్ స్పాట్స్ను గుర్తించి చర్యలు తీసుకోవాలి
65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు బ్లాక్ స్పాట్స్ను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని, వెంచర్లు వద్ద అక్రమంగా వేసిన రోడ్లను కూడా మూసివేయాలని వాహనదారులు,ప్రయాణికులు కోరుతున్నారు. బైపాస్ రోడ్డుకు సర్వీస్ రోడ్డు లేకపోవడంతో వెంచర్ల నుంచి వచ్చే వాహనాలు నేరుగా బైపాస్ రోడ్డు పైకి వస్తున్నాయని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.