బడంగ్పేట : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడ జరగడం లేదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ తిరుమల్ నగర్ కాలనీలో అభివృద్ధి పై అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్స్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, రామిడి కవితా రాంరెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కాలనీ వాసులు మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కంకణ బద్దులై పనిచేస్తున్నారని ఆమె కొనియాడారు.
తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ర్యాంక్లు, నివేదికలు అందుకు నిదర్శనం అన్నారు. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య, విద్య, వైద్యం అన్ని వర్గాలకు అందించాలన్న సంకల్పంతో పనిచేస్తుందన్నారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో అమేజాన్ వంటి అనేక కంపెనీలు వస్తున్నాయని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నా రు. మహిళలకు ఉపాధి కల్పించడానికి నాదర్గుల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
వాక్సినేషన్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. పెరుగుతున్న జనాబాకు అనుగుణంగా అభివృద్ది చేయవలసిన అవసరం ఉందన్నారు. వైద్య సౌలభ్యం మెరుగు కోసం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా మంచి నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.210 కోట్లు కెటాయించగా అందులో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు రూ.110 కోట్లు కెటాయించడం జరిగిందన్నారు. కార్పొరేషన్ పరిధిలో 7 రిజర్వాయర్స్ నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. అందుకు టెండర్ ప్రిక్రియ పూర్తి అయిందన్నారు. 250 కిలో మీటర్ల మేర పైపులైన్ వేయిస్తున్నామని అన్నారు.
రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట : సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేచినందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు రోడ్ల విస్తరణ, లింక్ రోడ్ల అభివృద్ది చేయడానికి ప్రభుత్వం నిధులు కెటాయిస్తుందన్నారు.
చెరువులను అనుసంధానం చేయడం, నాలాల అభివృద్ధికి రూ.360 కోట్లు మంజూరు చేయగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు రూ.186 కోట్లు కెటాయించడం జరిగిందన్నారు. స్ట్రీట్లైట్స్ ఏర్పాటుకు రూ.50 కోట్లు కెటాయించడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, ముత్యాల కృష్ణ, కాలనీ అసోసియోషన్ నాయకులు,కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.