సుజాతనగర్, జనవరి 19: యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ సర్కార్ సూచిస్తున్నది. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు, అతి తక్కువ కాలంలో మెరుగైన దిగుబడులు సాధించే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలా లాభాలు తెచ్చే పంటల్లో ముఖ్యమైనది స్వీట్కార్న్. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలానికి చెందిన రైతులు ఈ సారి సుమారు 3 వేల ఎకరాల్లో సాగు ప్రారంభించారు. ప్రస్తుతం పేలాల మక్కలు, బేబీకార్న్ రకాల సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రకం మొక్కజొన్నల్లో అధిక ప్రోటీన్లు ఉంటాయి. మక్కల్లో అధిక ప్రోటీన్లు ఉండడం, సాధారణ మక్కల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఉండడంతో మార్కెట్లో డిమాండ్ బాగుంటుంది. దిగుబడి రావడమే ఆలస్యం హాట్ కేకుల్లా కంకులు అమ్ముడుపోతాయి. ఎకరాకు దాదాపు 33 వేల పచ్చి కంకుల దిగుబడి వస్తుంది. ఎకరాకు సుమారు రూ 30 వేల వరకు ఆదాయం వస్తుంది.
దశల వారీగా విత్తుకోవాలి…
తీపి మక్క పంటకు 19 నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలం. మొక్కలు అధిక, కనిష్ఠ ఉష్ణోగ్రతలను తట్టుకోవు. దీని సాగుకు మురుగు నీరు పోయే వసతి ఉన్న ఎర్ర రేగడి నేలలు, మధ్య రకపు రేగడి నేలలు అనుకూలం. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు సాగుకు పనికిరావు. ఎకరానికి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది. సాధారణ రకాలతో పోలిస్తే స్వీట్ కార్న్ విత్తనాలు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విత్తనాలు నాటే ముందురోజు నీరు పెట్టాలి. మరో నాలుగు నుంచి ఐదు రోజులకు నీరు అందించాలి. దీంతో మొలక శాతం పెరుగుతుంది. ఆ తర్వాత నీటి ఎద్దడి రాకుండా వారం రోజులకో తడి ఉండేలా చూసుకోవాలి. కొంత భూమిలో విత్తనాలు వేసి కొన్ని రోజులు ఆగాలి.ఆ తర్వాత పది రోజులకోసారి విడతల వారీగా మిగిలిన భూమిలో విత్తనాలు నాటాలి.
ఎరువుల వాడకం కీలకం…
ఎకరాకు నత్రజని 60-72 కిలోలు, భాస్వరం 24 కిలోలు సరిపోతుంది. మొత్తం భాస్వరం పొటాష్ ఎరువులను విత్తే సమయంలో వేయాలి. నత్రజని మూడు దఫాలుగా సమానంగా విత్తేటప్పుడు ఒకసారి, 30-35 రోజులకు రెండోసారి, పూత దశలో మూడోసారి వేయాలి. భూమిలో జింక్ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. కలుపు నివారణకు విత్తన 1-2 రోజుల్లో ఎకరాకు ఒక కిలో అట్రాజిన్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 25-30 రోజుల అనంతరం అంతర కృషి చేసి కలుపు మొక్కలను తొలగించాలి.
కాండం తొలుచు పురుగు నివారణ ఇలా..
ప్రస్తుతం పంటను కాండం తొలుచు పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయి. పంటకు నష్టం చేస్తున్నాయి. ఇవి ఆకులపై గుండ్రటి చిల్లులు చేసి కాండంలో ఎస్ ఆకారంలో సొరంగాలు చేస్తున్నాయి. క్రమంగా మొక్కలు చనిపోతాయి. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కొరాజిన్ 0.3 మిల్లీలీటర్ల మందులో లీటర్ నీటికి కిలిపి పిచికారీ చేయాలి. క్రిమి సంహారక మందులు వాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించాలి.
మార్కెట్లో మంచి డిమాండ్..
పంట అతి తక్కువ కాలంలో కోతకు వస్తుంది. నేరుగా మార్కెట్కు వెళ్లే సరాసరి తినే పదార్థాల్లో మేటి స్వీట్కార్నే. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నీటి వసతి ఉన్న ఏ ప్రాంతాల్లోనైనా ఏ సమయంలోనైనా విత్తుకోవచ్చు. పంటకాలం కేవలం 75 నుంచి 80 రోజులే. కంకులు తీసిన తర్వాత మిగిలిన పనలు పశువులకు పచ్చి మేతగా ఉపయోగపడతాయి. పచ్చి మేతను డెయిరీ ఫాం నిర్వాహకులూ కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ను బట్టి ఒక్కో కంకి రూ.8 నుంచి రూ.10 వరకు పలుకుతుంది.