మెదక్, జనవరి 20 : కరోనా, ఒమిక్రాన్ నియంతణ్రకు పకడ్బందీగా ఇంటింటి సర్వే చేపట్టాలని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఇంటింటి ఆరోగ్యం సర్వే చేపట్టాలని నిర్ణయించిందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన మల్టీ డిసిప్లినరీ బృందాలను యాక్టివేట్ చేసి శుక్రవారం నుంచి ప్రతి మున్సిపల్ వార్డు, గ్రామాల్లో రోజు కనీసం 30 నుంచి 60 ఇండ్లను సందర్శించి ఒక్కో ఇంటి దగ్గర కనీసం 5 నిమిషాలు సమయం కేటాయించి కుటుంబ ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలన్నారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే ఐసొలేషన్ కిట్లు అందించాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామాలకు 35 వేల కిట్లు అందజేశామని, మరో 40 వేల కిట్లు పంపిస్తామన్నారు. ఇంటింటి సర్వేలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీరాజ్ కార్యదర్శి, మున్సిపల్ సిబ్బంది అందరూ సమన్వయం చేసుకుంటూ సర్వే నిర్వహించాలన్నారు. ఇందులో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి త్వరగా ఇంటింటి సర్వే పూర్తి చేసి కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని సూచించారు. అదేవిధంగా రెండో డోస్ వ్యాక్సిన్ 15 నుంచి 17 ఏండ్లలోపు యువత, బూస్టర్ డోస్, ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఈనెల 25లోపు వంద శాతం టీకా ఇచ్చేలా చూడాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో శైలేశ్, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.