జిల్లాలోని పలు ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. తొలుత సీతారాముల తరఫున పలువురు వేర్వేరుగా పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం విగ్రహాలను ఊరేగింపుగా వేదికపైకి చేర్చారు. పండితులు కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కల్యాణ ఘట్టాన్ని తిలకించి తరించారు. అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు. కాశీబుగ్గలోని భక్తమార్కండేయ ఆలయం, పోచమ్మమైదాన్లోని శ్రీశృంగేరి శంకర మఠం, శివనగర్లోని సీతారామచంద్ర స్వామి, ఓ సిటీలోని సీతారామాంజనేయస్వామి ఆలయాల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నెక్కొండ మండల కేంద్రంలోని రామాలయం, బొల్ల్లికొండగుట్ట, దుగ్గొండి మండలం నాచినపల్లి రామాలయం ఆవరణల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేదమంత్రాలు.. మంగళవాయిద్యాల నడుమ సీతమ్మ మెడలో రామయ్య తాళికట్టగా భక్తజనం కనులారా తిలకించి పులకించింది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లా అంతటా వేడుకలు ఘనంగా జరుగగా, రామనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి.
ప్రముఖులు, భక్తులు పట్టువస్ర్తాలు సమర్పించగా కల్యాణ ఘట్టాన్ని చూసేందుకు వచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీసమేతంగా పాల్గొని రాములోరికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంతో పాటు పలు రామాలయాల్లో జరిగిన ఉత్సవాలకు మంత్రి దంపతులు హాజరయ్యారు. సాయంత్రం వేళ మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై సీతారాముల ఉత్సవ విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్రకు భక్తజనం భారీగా తరలివచ్చింది. ఉత్సవాల్లో భాగంగా జనగామలోని బాణాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళల కోలాటాలు, జీడికల్ ఆలయంలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.