తూప్రాన్/రామాయంపేట/మనోహరాబాద్, సెప్టెంబర్ 28: తూప్రాన్, మనోహరాబాద్, శివ్వంపేట మండలాల్లో వర్షం దంచికొట్టింది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఆయా మండలాల్లో కురిసిన వర్షానికి పంటపొలాలు నీటమునిగాయి. తూప్రాన్ మండలంలో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 15 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తహసీల్దార్ శ్రీదేవి తెలిపారు. కాగా మెదక్ జిల్లాలోనే అత్యధికంగా ఇస్లాంపూర్లో 94.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండలంలోని యావాపూర్, కిష్టాపూర్, ఆబోతుపల్లి చెక్డ్యాం మీదుగా ప్రవహిస్తున్న హల్దీవాగులో ఇంతకు ముందే కాళేశ్వరం జలాలు పారుతుండగా సోమవారం కురిసిన భారీ వర్షానికి చెక్డ్యాంలు పొంగి పొర్లాయి. మనోహరాబాద్ మండలంలో 73.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ భిక్షపతి తెలిపారు. దీంతో కాళ్లకల్, కూచారం, జీడిపల్లి, మనోహరాబాద్, రామాయిపల్లి చెరువులు అలుగులు పారాయి. మనోహరాబాద్ చెరువు అలుగుపారడంతో గ్రామస్తులు, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్ అలుగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాయిపల్లి జాతీయ రహదారి నూతనంగా నిర్మిస్తున్న రైల్వే వంతెన కింద కొద్దిపాటి నీరు నిలిచి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో ఎస్సై రాజుగౌడ్, సిబ్బంది భారీ మోటర్లతో నీటిని తొలిగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. శివ్వంపేట మండలంలో 55.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శభాష్పల్లి, దొంతి వాగులు పొంగి పొర్లాయి. చిన్నగొట్టిముక్ల నుంచి గోమారానికి వెళ్లేదారిలో వరద ఉధృతికి నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నవాబుపేట చెరువులో 12 మేకలు గల్లంతయినట్లు తహసీల్దార్ రవికుమార్ తెలిపారు.
హవేళీఘనపూర్లో..
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 28: కురుస్తున్న వర్షాలకు తోడు సోమవారం భారీ వర్షంతో మెదక్ జిల్లా సరిహద్దులోని పోచారం డ్యాం పొంగిపొర్లుతున్నది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో వాగుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెరుగడంతో పోచారం డ్యాం మంగళవారం పొంగిపొర్లింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పోచారం డ్యాంను చూసేందుకు పర్యాటకులు రాకూడదని హవేళీఘనపూర్ ఎస్సై శేఖర్ రెడ్డి అన్నారు. డ్యాంకు పర్యాటకులు రాకుండా ఉండేందుకు గానూ దారిని మూసివేసినట్లు తెలిపారు.
పెద్దశంకరంపేటలో…
పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 28: పెద్దశంకరంపేట మండలంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 6.2 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
రామాయంపేటలో..
రామాయంపేట, సెప్టెంబర్ 28: రామాయంపేట, చేగుంట, నార్సింగి మండలాల వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అక్కన్నపేట, దంతెపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, లక్ష్మాపూర్, కాట్రియాల, చేగుంట మండలం రెడ్డిపల్లి, నార్సింగి మండలంలోని తదితర గ్రామాల్లో చెరువులు, చిన్నపాటి కుంటలు నిండుకున్నాయి. 6 సె.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
చెరువులకు జలకళ
నర్సాపూర్, సెప్టెంబర్28: నర్సాపూర్ మండలవ్యాప్తంగా చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగులు పారాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి 105 ఎకరాల వరి, 23 ఎకరాల పత్తి పంట నీట మునిగిందని ఏవో వెంకటేశ్ తెలిపారు.
అలుగుపారుతున్న మన్నెవారి జలాల్పూర్ ఎక్కచెరువు
వెల్దుర్తి, సెప్టెంబర్ 28: రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని చెరువులు, కుంటలు అలుగులు పారుతుండగా, హల్దీప్రాజెక్టుతో పాటు హల్దీవాగుపై ఉన్న తొమ్మిది చెక్డ్యాంలు మత్తడి దూకుతున్నాయి. ఇదిలా ఉండగా మాసాయిపేట మండల పరిధిలోని హల్దీప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా వెల్దుర్తి పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.