మద్దూరు, సెప్టెంబర్ 23 : సిద్దిపేట జిల్లా వద్దూరు మండలం గాగిళ్లాపూర్ గ్రామానికి చెందిన మీస సత్యనారాయణ ఈ నెల 17న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి, తినడానికి తిండి, ఉండడానికి కనీసం నీడ లేకపోవడంతో ఊరు బయట టెంటు కింద సత్యనారాయణ భార్య కవిత తన ఇద్దరు కూతుళ్లతో పాటు వృద్ధురాలైన అత్తతో బిక్కుబిక్కు మంటూ రోజులను గడుపుతున్నది. ఈ నెల 22న ‘ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు’ అనే కథనాన్ని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రచురించడంతో జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. గురువారం ఉదయం అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ గ్రామాన్ని సందర్శించి మృతుడి కుటుంబా న్ని పరామర్శించారు. టెంటు కింద ఉన్న కవిత కుటుంబాన్ని చూసి చలించిన అదనపు కలెక్టర్ అధైర్య పడొ ద్దు.. మీకు అండగా మేము ఉన్నామని భరోసా కల్పించారు. ఆ కుటుంబానికి డబుల్బెడ్ రూం ఇల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరు ఆడపిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించేందుకు ఏర్పాట్లు చేయాలని డీసీపీవో రామ్ను అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. వీరిని వెంటనే ప్రభుత్వ భవనానికి తరలించి ఆశ్రయం కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థికసాయంతో పాటు నిత్యావసరాలను అందజేశారు. జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి రూ.5వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. కాగా, అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిరుపేద కుటుంబాన్ని గ్రామంలోని సబ్సెంటర్కు తరలించి ఆశ్రయం కల్పించారు. అనంతరం మృతుడి భార్య కవిత మాట్లాడారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు రుణపడి ఉంటామన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పో యి తాము పడుతున్న బాధలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హు స్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్, ఎంపీవో సుధీర్, ఏపీవో పరశురాములు గౌడ్, ఆర్ఐ ఐలయ్య, ఉపసర్పంచ్ మాధవి గోపాల్, పీఏసీఎస్ డైరక్టర్ మల్లేశం, పంచాయతీ కార్యదర్శులు భాగ్యలక్ష్మి, ప్రవీణ్కుమార్, వీఆర్వో శివరాజం పాల్గొన్నారు.