సిద్దిపేట అర్బన్/మెదక్ మున్సిపాలిటీ/సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 20 : కరోనా నేపథ్యంలో చాలాకాలం తర్వాత గత సెప్టెంబర్లో విద్యాసంస్థలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా గురుకులాలు తెరవొద్దని అప్పట్లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గి ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలను సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ బుధవారం హైకోర్డు తీర్పు ఇచ్చింది. ఒకవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు, మరోవైపు పాఠశాల విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు ఏకీభవించి గురుకుల పాఠశాలలు తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు నేడో, రేపో ప్రభుత్వం గురుకుల పాఠశాలల ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉన్నది
సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో మొత్తం 56 గురుకుల పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసులు మాత్రమే విన్న గురుకుల పాఠశాలల విద్యార్థులు ఇకపై ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. మొత్తం 56 గురుకుల పాఠశాలల్లో 17,577 మంది విద్యార్థులు ఉన్నా రు. ఇందులో 22 కేజీబీవీల్లో 3,926 మంది విద్యార్థినులు, ఒక తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 628 మంది, 16 సాంఘిక గురుకుల పాఠశాలల్లో 7,298 మంది, 10 బీసీ గురుకులాల్లో 3,413 మంది, 6 మైనార్టీ గురుకులాల్లో 1,917 మంది, ఒక ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 395 మంది విద్యార్థులు ఉన్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో కస్తూర్బా విద్యాలయాలు 14, కస్తూర్బా గురుకుల కళాశాలలు 4, అర్బన్ గురుకుల పాఠశాల 1, మోడల్ గురుకుల పాఠశాలలు 4 ఉన్నాయి. వీటిలో సుమారు 5 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో బీసీ వెల్ఫేరు గురుకులాలు 35, ఎస్సీ వెల్ఫేరు గురుకులాలు 47, సాంఘిక సంక్షేమ గురుకులాలు 12, మైనార్టీ సంక్షేమ గురుకులాలు 12 ఉన్నాయి. వీటిలో సుమారు 6 వేల మంది విద్యార్థులు ఉన్నారు.