కొమురవెల్లి మల్లన్న మహా ప్రసాదం మరింత మందికి అందనున్నది. త్వరలోనే ఆదివారం 300 మందికి, మిగిలిన రోజుల్లో నిత్యం 100 మందికి అన్నదానం చేయనున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తుండగా, అన్నదానం మరింత మందికి చేసేందుకు మల్లన్న ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతిపాదనలు దేవాదాయశాఖ కమిషనర్కు అందజేసింది. అనుమతులు రాగానే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చేర్యాల, అక్టోబర్ 19 : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన కొమురవెల్లి మల్లన్న ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా వసతులు, సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వం, ఆలయ కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే క్యూలైన్లు, అదనంగా కాటేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కాగా, కొత్తగా మరింత మంది భక్తులకు అన్నదానం చేయాలని సంకల్పించారు. మల్లన్న ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి పంపిన ప్రతిపాదనలు దేవాదాయశాఖ కమిషనర్కు చేరాయి. అక్కడి నుంచి త్వరలోనే అనుమతులు రానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆదివారం రోజున 100 మందికి, మిగిలిన రోజుల్లో 50 మందికి అన్నదానం చేస్తున్నారు. త్వరలోనే ఆదివారం 300 మందికి, మిగిలిన రోజుల్లో నిత్యం 100 మందికి అందించనున్నారు
దాతల విరాళంతో భక్తులకు సౌకర్యం…
కొమురవెల్లి మల్లన్న స్వామికి దాతలు అందిస్తున్న విరాళాలను ఆలయ అధికారులు బ్యాంకులో జమచేసి వచ్చిన వడ్డీతో అన్నప్రసాద వితరణను 15 ఏండ్లుగా కొనసాగిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఆదివారం రోజున 500 మందికి, మిగతా రోజుల్లో 50 మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. కాగా, స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లలో ఉదయం 9 నుంచి 10గంటల మధ్య సమయంలో అన్నదానం టికెట్లను ఆలయ సిబ్బంది అందజేస్తారు.టికెట్లు లభించిన భక్తులు మధ్యాహ్నం 12.30 నుంచి 2గంటల మధ్యలో కొనసాగే అన్నదానంలో పాల్గొని భోజనం చేయాల్సి ఉంటుంది.అన్నప్రసాద వితరణ శాలలో నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో 500 మందికి భోజనం అందించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు దేవాదాయశాఖ అధికారులకు గతంలో ఆదేశాలు జారీచేశారు. మంత్రి ఆదేశాల మేరకు అంతమేర భోజనాలు ఉత్సవాల సమయంలో భక్తులకు అందిస్తున్నారు.
అన్నప్రసాద వితరణకు రూ.1.29 కోట్ల విరాళాలు..
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న అన్నప్రసాద వితరణకు భక్తులకు మొక్కుల రూపంలో చెల్లించిన విరాళాలు రూ.1,29 కోట్లు స్వామి పేరిట బ్యాంకుల్లో అధికారులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు.డిపాజిట్ల ద్వారా వచ్చిన డబ్బులతో 15 ఏండ్లుగా సత్రాన్ని నిర్వహిస్తున్నారు. స్వామి వారి అన్నప్రసాద వితరణకు రూ.లక్షకు పైగా విరాళం ఇచ్చిన వారిని మహారాజ పోషకులని,రూ. 50వేలకు పైగా ఇచ్చిన వారిని రాజపోషకులని, రూ. 25వేలకు పైగా ఇచ్చిన దాతలను పోషకులుగా గుర్తిస్తున్నారు. వారిచ్చిన విరాళ వివరాలను ప్రత్యేక బోర్డులో పొందుపరిచి దాతలను ఆలయవర్గాలు గౌరవిస్తున్నాయి.ఇటీవల ఘట్కేసర్కు చెందిన పులిపాక అర్జున్ అనే దాత రూ.50వేల విరాళాన్ని అందజేశారు.
ధర్మకర్తల మండలి కార్యాచరణ రూపొందించింది..
కొమురవెల్లి మల్లన్న భక్తులకు అదనంగా భోజనం అందించాలని ఆలయ ధర్మకర్తల మండలి ఇటీవల కార్యచరణ రూ పొందించింది.స్వామి వారికి భక్తుల రూపంలో చెల్లించిన విరాళాలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాం. డిపాజిట్లతో వచ్చిన డబ్బుతో పాటు కొంత మేరకు ఆలయ నుంచి భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వెచ్చిస్తున్నాం. కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే ధర్మకర్తల మండలి నిర్ణ యం మేరకు మరింత మంది భక్తులకు భోజనం అందిస్తాం.
ఆదేశాలు రాగానే అమలు..
ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ అధికారులు ఉన్నతాధికారుల నివేదిక పంపించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ నుంచి ఆమోదం రాగానే రోజువారిగా 100, ఆదివారం 300 మందికి భోజనాలు అం దిస్తాం. అన్నప్రసాద వితరణశాలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేందుకు కృషి చేస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం