గులాబీ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి నుంచి మొదలైన సంస్థాగత నిర్మాణంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వెల్లివిరుస్తున్నది. ఈ నెల 2 నుంచి మొదలైన పార్టీ, దాని అనుబంధ సంఘాల వార్డు, గ్రామ కమిటీల నిర్మాణం ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు పూర్తయ్యింది. నేటి నుంచి మండల, పట్టణ కమిటీల నియామకం మొదలు కానుండగా, ఈ20వ తేదీలోపు పూర్తి చేసే లక్ష్యంగా పార్టీ ముందుకు కదులుతున్నది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు వారివారి నియోజకవర్గాల్లో ఎన్నికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడక్కడ మిగిలిపోయిన గ్రామ కమిటీల ఎన్నికలను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు.
ఈ నెల 20వతేదీలోపు పూర్తి..
టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వార్డు, గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తి కావొచ్చాయి. ఈ నెల 2వతేదీన అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మండల, నియోజకవర్గాల వారీగా పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల కమిటీల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20వ తేదీలోపు మండల, పట్టణ కమిటీల ఎన్నికలను పూర్తి చేసే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తి చేసిన మండలాల్లో మండల, పట్టణ కమిటీల ఎన్నికలపై దృష్టి సారించారు. మొత్తంగా ఈ నెల 20వ తేదీలోపు మండల, పట్టణ స్థాయి వరకు అన్ని ఎన్నికలను పూర్తి చేయనున్నారు. అనంతరం 20వతేదీ నుంచి 25వ తేదీలోపు జిల్లా కమిటీల ఎన్నికలను పూర్తి చేస్తారు. ఈ ఎన్నికలను పూర్తి చేసేందుకు ఆయా జిల్లాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించారు. ప్రతి మండల, పట్టణ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 51 శాతం వరకు కేటాయిస్తారు. ప్రతి కమిటీలో 22 నుంచి 25 మందికి చోటు కల్పిస్తారు.
పూర్తి కావొచ్చిన వార్డు, గ్రామ కమిటీల ఎన్నికలు..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వార్డు, గ్రామ కమిటీల ఎన్నికలు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఈ నెల 12వ తేదీలోపు అన్ని గ్రామాల్లో గ్రామ, వార్డు కమిటీలతో పాటు అనుబంధ కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇది వరకే ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అన్ని నియోజకవర్గాల్లో గడువులోపు కమిటీలను పూర్తి చేసేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ బాధ్యులు మెజార్టీ గ్రామాల్లో వార్డు, గ్రామ కమిటీల ఎన్నికలను పూర్తి చేశారు. అక్కడక్కడ మిగిలిపోయిన గ్రామ కమిటీల ఎన్నికలను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. గ్రామ కమిటీల్లో 11 మందికి అవకాశం కల్పించారు. కొన్ని గ్రామాల్లో 25 మంది వరకు చోటు కల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి కమిటీలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 51శాతం వరకు అవకాశం కల్పించారు. ప్రతి గ్రామంలో ఎస్సీ, బీసీ, యువత, రైతు, మహిళా, సోషల్ మీడియాతో పాటు అనుబంధ కమిటీలను నియమించారు. గడపగడపకూ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధిని వివరించేలా పార్టీ నూతన పాలక వర్గాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నూతన కమిటీల పాలక వర్గాలు మంచి జోష్లో ఉన్నాయి. పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. జిల్లాలు ఏర్పాటు అయ్యాక హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాలు సగ భాగం సిద్దిపేట జిల్లాలో కలువడంతో 12 నియోజకవర్గాలు అవుతాయి. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకునేలా వార్డు స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రం వరకు పటిష్టమైన క్యాడర్ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అంకితభావంతో పనిచేసే వారికి పదవులు దక్కుతున్నాయి.