గజ్వేల్, అక్టోబర్ 4: వందేండ్ల క్రితం ఉన్న పచ్చటి వాతావరణాన్ని మళ్లీ సృష్టించి, హరితహారంతో సీఎం కేసీఆర్ తెలంగాణలో కరువు కాటకాలను దూరం చేశారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ అర్బన్ పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే మొక్కల పెంపకానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణలో తీవ్రమైన కరువు, దుర్భిక్ష పరిస్థితులు చూశామన్నారు. చిన్నప్పుడు దట్టమైన అడవులు ఉండేవని, స్మగ్లింగ్ ముఠాలతో అద్భుతమైన వన సంపద కరుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వెయ్యి ఫీట్లు బోరు వేసినా నీళ్లు రాని పరిస్థితి, తీవ్రమైన కరువు పరిస్థితులతో పంటలు నష్టపోయి అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కొనసాగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ఏడు విడుతలుగా నిర్వహించిన హరితహారంలో కోట్ల మొక్కలు నాటించారన్నారు. అడవుల్లో విత్తనాలు చల్లినట్లు తెలిపారు. పచ్చదనం పెరిగిన సకాలంలో వర్షాలు కురవడంతో తెలంగాణలో కరువు పూర్తిగా తొలగిపోయి అద్భుతమైన జలవనరులు ఏర్పడ్డాయన్నారు. గజ్వేల్లో 33వేల ఎకరాల్లో అడవుల అభివృద్ధి జరిగిందన్నారు. పల్లెలు, పట్టణాల్లో ఖాళీ ప్రదేశాల్లో ఉద్యమంలా మొక్కల పెంపకం కొనసాగుతున్నదన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో, మున్సిపాలిటీల్లో నర్సరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కోట్లాది మొక్కలను నాటగా, అవి వృక్షాలుగా ఎదిగి ప్రస్తుతం రాష్ట్రంలో 26శాతం పచ్చదనం ఏర్పడిందని, త్వరలో మిగతా 6శాతం కూడా పూర్తి చేసుకుని 33శాతం పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని, అందుకే హరితనిధిని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు తమవంతుగా హరితనిధికి ఫండ్ జమచేస్తే ప్రతి ఒక్కరూ హరితహారంపై తమ బాధ్యతను నిర్వర్తించిన వారవుతారన్నారు. గజ్వేల్ ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
దమ్ముంటే అర్బన్ పార్కుకు రండి..
అటు రాష్ట్రంలో, ఇటు గజ్వేల్ నియోజకవర్గంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్నదని ఎఫ్ఢీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకులు వెనకా ముందు ఆలోచించకుండా, విచక్షణా రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా వందశాతం ప్రభుత్వ ఉద్యోగ కల్పన సాధ్యం కాదని, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల కల్పన చేసి అవకాశాలను ఏర్పరుస్తారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలించే రాష్ర్టాల్లో వందశాతం ఉద్యోగాలు కల్పించారా..? అని ప్రతిపక్ష నాయకులను ఆయన ప్రశ్నించారు. ఐటీశాఖ మంతి కేటీఆర్ ఫార్మా, ఐటీ రంగాలతో పాటు ప్రఖ్యాత కంపెనీలను రాష్ర్టానికి తీసుకువచ్చి ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తున్నారన్నారు. దేశానికి ఎక్కువగా ఆదాయాన్ని ఇచ్చే రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు. లెక్కలు తెలియకుండా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. గజ్వేల్లో ఏడేండ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చిండానికి గజ్వేల్ అర్బన్ పార్కుకు రావాలని, ఎప్పుడొచ్చినా తాను సిద్ధంగా ఉంటానని సవాలు విసిరారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలన్నారు. సమావేశంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గోపాల్రెడ్డి, కౌన్సిలర్లు ఉప్పలమెట్టయ్య, బాలమణి శ్రీనివాస్రెడ్డి, బొగ్గుల చందు, నాయకులు గుంటుకు రాజు, రవి, శీర్ల మల్లేశం, ఎటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ ప్రతాప్రెడ్డి, పల్లెపహాడ్ మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్చారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
హరితనిధికి రూ.3.30లక్షల విరాళం
గజ్వేల్ అర్బన్ పార్కులో హరితనిధికి బోణీ అయ్యింది. నాయకులు గుంటుకు రాజు 11వేల రూపాయలను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి హరితనిధికి అందజేశారు. కౌన్సిలర్లు ఉప్పలమెట్టయ్య, బాలమణి శ్రీనివాస్రెడ్డి తమవంతుగా 11వేల రూపాయలను అందజేశారు. 5వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్బాల్ రూ.5వేలు, 2వ వార్డు అధ్యక్షుడు పొట్టి రవికుమార్ రూ.5వేలు అందజేశారు. గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం కౌన్సిలర్కు రూ.11వేల చొప్పున రూ.2.20లక్షలు, ఏఎంసీ చైర్పర్సన్ రూ.11వేలు, 20వార్డుల టీఆర్ఎస్ అధ్యక్షులు రూ.5వేల చొప్పున మొత్తం రూ.3.30 లక్షల డీడీ తీసి సీఎం కేసీఆర్కు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు.