కరువు కాటకాలతో కాలం వెల్లదీసిన హుస్నాబాద్ మెట్ట ప్రాంతం ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నది. ఎటుచూసినా గలగల పారుతున్న జలాలు.. పచ్చని పంట పొలాలు,.. చెట్లతో ఆకుపచ్చగా దర్శనమిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, మోయతుమ్మెద వాగులకు నిధులు కేటాయించి పునరుద్ధరించడంతో ప్రస్తుతం గుంట జాగ లేకుండా పంటలు సాగవుతున్నాయి. పంట పొలాలతో సస్యశ్యామలంగా మారింది ఈ ప్రాంతం. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి నీటి వనరులను పునరుద్ధరించింది. తోటపల్లి రిజర్వాయర్ పూర్తికావడంతో.. నాలుగైదేండ్లుగా నిండుకుండలా మారి ఆయకట్టులో బంగారు పంటలు పండుతున్నాయి. గౌరవెల్లి రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఇక సాగునీటికి ఢోకా ఉండదు. అన్నికాలాలు జలసవ్వడులు కనిపించనున్నాయి. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, ధూళిమిట్ట, మద్దూరు మండలాల్లో కరువు దూరమై.. సాగుబాగైంది. రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి.. అన్నదాతలు, రైతుకూలీలకు బతుకుకు భరోసా ఏర్పడింది.
పచ్చదనంతో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఎక్కడో కోనసీమలోనిది కాదు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలోనిది.. అవును నిజమే.. నమ్మశక్యంగా లేదు కదూ..! రాష్ట్ర ఏర్పాటుకు ముందు బీడు భూములు, ఎండిన వాగులు, చెరువులు.. అందులో బండరాళ్లు, రప్పలు..ఇసుక గుంతలు తప్పా.., చుక్క నీటిబొట్టు కనబడేది కాదు ఈ ప్రాంతంలో. పచ్చదనం ఎక్కడా అని వెతుక్కునే దుస్థితి ఉండేది.. పంటలు పండించేందుకు వర్షాల కోసం మొగులుకు ముఖం పెట్టి ఎదురుచూసే వారు రైతన్నలు.. నేడు ఆనందంతో అరక కట్టి బంగారు పంటలు పండిస్తున్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుస్నాబాద్/కోహెడ : ఎటుచూసినా బీడు భూములు.. గుట్టలు.. ఎండిన చెరువులు, వాగులు రాళ్లు రప్పల దర్శనం.. నెర్రెలు బారిన నేల.. మచ్చుకు కనిపించిన పచ్చదనం. సాగునీరు లేక వర్షాధారంపైనే ఆధారపడిన సాగు, పత్తి, మక్క, వేరుశనగ, పెసర తదితర రైతులు పంటలు వేసేవారు. వానలు పడితేనే పంటలు లేకపోతే అప్పులే మిగిలేవి. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు హుస్నాబాద్ మెట్ట ప్రాంతం పరిస్థితిది. కరువు కాటకాలతో ఈ ప్రాంతం సతమతమయ్యేది. కానీ, ఇప్పుడు ఎటుచూసినా గలగల పారుతున్న జలాలు.. పచ్చని పంట పొలాలు, చెట్లు దర్శనమిస్తున్నాయి. సాగునీరు లేక అరిగోస పడ్డ మెట్ట ప్రాంతంలో ఇప్పుడు బంగారు పంటలు పండుతున్నాయి. కోనసీమను మించి ప్రకృతి అందాలతో అలరారుతున్నది. పొలాల్లో తాటి చెట్లు కోనసీమ కొబ్బరి తోటలను తలపిస్తున్నాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, మోయతుమ్మెద వాగు పరీవాహక ప్రాంతంలో భూమికి పచ్చని రంగేసినట్లుగా పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా మారింది. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు అందాలు, మత్తడి పరవళ్లు, మోయతుమ్మెద వాగు జలసవ్వడులు, సింగరాయ లొద్ది ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. 3,500 ఎకరాల ఆయకట్టు, మరో 2వేల ఎకరాలకు పరోక్షంగా ప్రయోజనం కలిగించే కోహెడ మండలంలోని శనిగరం ప్రాజెక్టు మత్తడి, కాల్వలు శిథిలావస్థకు చేరగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.23కోట్లు కేటాయించి పునరుద్ధరించింది. మూడేండ్లలో శనిగరం ప్రాజెక్టు ప్రాంతం గజం జాగ ఖాళీలేకుండా పంటలు సాగుచేస్తూ పచ్చగా మారింది. మోయెతుమ్మెద వాగుపై నిర్మించిన సింగరాయ ప్రాజెక్టును రూ.5 కోట్లతో ప్రభుత్వం మరమ్మతులు చేయడంతో ఆయకట్టు మొత్తం పంటలే కనిపిస్తున్నాయి. తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకోవడంతో నిండుకుండలా మారింది. ఇక్కడి నుంచి కోహెడ మండలం మీదుగా సొరంగం, ఒపెన్ కెనాల్ ద్వారా గౌరవెల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలు చేరువేస్తారు. ఈ పనులు 90శాతం పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ పథకం మెట్ట ప్రాంతానికి ఎంతగానో మేలు చేసింది. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయి. తటాకాల కింద సాగు విస్తీర్ణం పెరిగింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. రైతులు, రైతు కూలీలకు ఉపాధి దొరకుతున్నది. హరితహారంలో భాగంగా ఈ ప్రాంతం ప్రభుత్వం విరివిగా మొక్కలు నాటడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మొక్కల నాటడంతో ఈ ప్రాంతంలో వర్షపాతం సైతం కొన్నేండ్లుగా పెరిగింది. హుస్నాబాద్ డివిజన్లో సాధారణ వర్షపాతం 80.6 సెం.మీ ఉండగా, గతేడాది 170.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈసారి జూన్ నుంచి మే వరకు 129.9 సెం.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. సాగునీటి వనరులు పెరగడంతో వరి సాగు బాగా పెరిగింది. హుస్నాబాద్ డివిజన్లో గతేడాది 53,613 ఎకరాల్లో పత్తి సాగైతే ఈసారి కేవలం 30,775 ఎకరాలకే పరిమితమైంది. పుష్కలంగా నీరు ఉండడంతో వరి పంట గతేడాది 64,601 ఎకరాల్లో సాగైతే ప్రస్తుతం 80,686 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. హుస్నాబాద్ డివిజన్లోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, ధూళిమిట్ట, మద్దూరు మండలాల్లో కరువు దూరమై పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.