జహీరాబాద్, జనవరి 21: కన్న కుమారుడు, కూతురు తండ్రిని పోషించలేక వదిలేసిన ఘటన మండలంలోని బర్ధీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురానికి చెందిన గురుప్రసాద్ (75) హైదరాబాద్లో స్థిరపడ్డారు. గురుప్రసాద్కు కుమారుడు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం సాయంత్రం బర్ధీపూర్ గ్రామంలో వదిలేసి వెళ్లిపోయారు. గురుప్రసాద్ పరిస్థితిని చూసిన సర్పంచ్ శివలక్ష్మి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గురుప్రసాద్ను జహీరాబాద్ సర్కారు దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. దవాఖానలో చికిత్స పొందుతున్న గురుప్రసాద్ను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. గురుప్రసాద్ కూతురుకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హైదరాబాద్లోని ‘గుడ్ సమారిటన్ ఇండియా’ఓల్డ్ ఏజ్ హోంకు పంపించారు. గురుప్రసాద్కు మెరుగైన వైద్యం అందించి, హైదరాబాద్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసిన సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు.