సంగారెడ్డి, అక్టోబర్ 19 : ప్రతిఒక్కరికీ న్యాయ సేవలు అందించాలనే ధ్యేయంతో న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తున్నదని, చట్టం ముందు అందరూ సమానులే అని న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై.రేణుక అన్నారు. మంగళవారం జిల్లా న్యాయమూర్తి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా జ్యుడీషియల్ అధికారులు, జడ్పీ సీఈవో, డీఆర్డీవో, డీపీవో, డీఎల్పీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర జిల్లా అధికారులతో జిల్లా జడ్జి బి.పాపిరెడ్డితో రేణుక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కక్షిదారులకు న్యాయం అందించే విధంగా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉందన్నారు. ప్రతిఒక్కరూ చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలన్నారు. సుప్రీం కోర్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 14 వరకు 42 రోజుల పాటు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవం’లో భాగంగా ప్రచారోద్యమం చేపట్టామన్నారు.
ఉచిత న్యాయ సేవలపై కరపత్రాలతో ప్రచారం..
ఈ నెల 2 నుంచి గ్రామాల్లో ఉచిత న్యాయ సేవలు, చట్టాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలతో ప్రచారం చేస్తున్నామని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. కరపత్రాలతో ఇంటింటికీ చేరేలా పంపిణీ చేయాలని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులకు సూచించారు. నవంబర్ 14 తర్వాత న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవల గురించి తెలియని వారు ఉండొద్దని, ప్రజలను న్యాయ సేవలపై చైతన్యం చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, స్పెషల్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ జె.హనుమంతరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పాల్గొన్నారు.