నారాయణఖేడ్, సెప్టెంబర్ 14 : వర్షం వస్తే ఆ గామస్తులకు జలగండం దాపురించినట్లే. ఇది సిర్గాపూర్ మం డలం సంగెం గ్రామస్తులు ఒకప్పుడు ఎదుర్కొన్న బాధ. సిర్గాపూర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామ ప్రజలు తరతరాల నుంచి వాగుకారణంగా అనేక ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న సంగెం గ్రామస్తుల సమస్యకు మోక్షం లభించింది. ప్రభుత్వం రూ.2.10 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు చరమగీతం పాడింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రూ.38.20 కోట్లతో కొత్తగా 22 వంతెనలు నిర్మించారు.
గజ్వేల్, సెప్టెంబర్ 14: గతంలో వర్షం వస్తే రిమ్మనగూడ -బూర్గుపల్లి గ్రామాల మధ్య, క్యాసారం -దాచారం గ్రామాల మధ్య కూడవెల్ల్లివాగు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయేవి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ గ్రామాల మధ్య కూడవెల్ల్లివాగుపై వంతెన ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా పనులు వేగంగా పూర్తిచేశారు. ప్రస్తుతం వంతెనలపై నిరంతరంగా రాకపోకలు కొనసాగుతున్నాయి.
వంతెన నిర్మాణంతో బాధ తీరింది
వంతెన నిర్మాణం చేపట్టడంతో బాధ తీరింది. గతంలో వర్షాకాలం వస్తుందంటే ఆందోళనకు గురయ్యేవాళ్లం.ఇతర గ్రామాలకు వెళ్లిన సందర్భాల్లో వర్షం వస్తే వాగు ద్వారా ప్రవహిస్తున్న నీటి ఉధృతిని తెలుసుకుని అక్కడే ఉండిపోయేవాళ్లం. ఇప్పుడు బ్రిడ్జి నిర్మించడంతో వాగు దాటాల్సిన ప్రమాదకర పరిస్థితుల నుంచి శాశ్వతంగా విముక్తి కలిగింది. ఎమ్మెల్యే భూపాల్రెడ్డిసారు కృషితో ప్రభుత్వం మా బాధలు తీర్చినందుకు సంతోషంగా ఉంది.
గతంలో ఇబ్బంది పడేవాళ్లం
వర్షం వస్తే రాజీవ్ రహదారిపై వెళ్లటానికి వీలు లేకుండా ఉండేది. వాగు నిండా నీటి ప్రవాహం ఉండటంతో 15కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. గ్రామస్తులంతా చాలా ఇబ్బంది పడేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత బూర్గుపల్లివాగు పై వంతెనను ప్రభుత్వం నిర్మించంది. దీంతో అందరికీ సౌకర్యంగా మారింది.
దూరభారం తగ్గింది..
మా ఊరు నుంచి 4కిలోమీటర్లు ప్రయాణిస్తే గజ్వేల్కు వెళ్తాం. దాచారం – క్యాసారం మధ్యలో వాగు నిండితే చుట్టూ తిరిగి పిడిచెడ్ మార్గంగుండా ఏడు కిలోమీటర్లు ప్రయాణించి గజ్వేల్కు చేరుకోవాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చిన తర్వాత వాగుపై వంతెన నిర్మించింది. బ్రిడ్జి నిర్మాణంతో దూరభారం తగ్గింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-గోవర్ధన్, ప్రభుత్వ ఉద్యోగి, దాచారం
ఇబ్బందులు దూరం
నర్సాపూర్, సెప్టెంబర్ 14 : నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్,కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, ఉమ్మడి వెల్దుర్తి మండలాల్లో తొమ్మిది బ్రిడ్జీలు నిర్మించారు. నర్సాపూర్ మండలంలోని మూసాపేట్, దౌలాపూర్ గ్రామాల మధ్య తెలంగాణ వచ్చిన తర్వాత బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. తెలంగాణ ఏర్పడక ముందు కొల్చారం మండలంలోని తుక్కాపూర్లో, తెలంగాణ ఏర్పడిన తర్వాత పోతంశెట్టిపల్లిలో రెండు వంతెనలు నిర్మించారు. చిలిపిచెడ్ మండలంలో చిట్కుల్ వద్ద తెలంగాణ వచ్చిన తర్వాత, చాముండేశ్వరి వద్ద తెలంగాణ రాకముందు వంతెనలు నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వెల్దుర్తి మండలంలోని ధర్మారం, ఎం.జలాల్పూర్ గ్రామాల మధ్య, కౌడిపల్లి మండలంలోని లింగంపల్లి వద్ద, కౌడిపల్లి శివారులో వంతెనలు నిర్మించారు. గతంలో కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి వద్ద బ్రిడ్జి లేక ప్రజలు అవస్థలు పడ్డారు. చుట్టూ 20 కిలోమీటర్ల దూరం తిరిగి ఏడుపాయల దేవాలయానికి వెళ్లాల్సి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వ రూ.29 కోట్లతో నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో దూరభారం తగ్గింది.
మెరుగైన సౌకర్యం.. ఆనందం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
సిద్దిపేట , సెప్టెంబర్ 14 : సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని గ్రామాల్లో వాగులపై వంతెనలు ..‘కల్వర్టులు’.. లోలెవల్ కాజ్వేల నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నిధులు మంజూరు చేయించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట నుంచి సిరిసిల్ల్ల జిల్లాకు వెళ్లే రహదారి, సిద్దిపేట నుంచి వరంగల్కు వెళ్లే రహదారి, సిద్దిపేట నుంచి గజ్వేల్కు వెళ్లే రహదారుల్లో నాలుగు బ్రిడ్జిలు నిర్మించారు. సిద్దిపేట -సిరిసిల్ల్ల రహదారిపై సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇమంబాద్ వద్ద సుమారు రూ.2.50 కోట్లతో వంతెన, నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది ఎల్లమ్మవాగుపై రూ.2.73 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా.. సిద్దిపేట నుంచి సిరిసిల్ల్లకు వాహనదారులు సాఫీగా వెళ్తున్నారు. సిద్దిపేట -వెంకట్రావ్పేట రహదారిపై సిద్దిపేట ఆర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లి వద్ద సుమారు రూ.2 కోట్లతో వంతెన నిర్మించడంతో అటు వైపు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా మారింది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగాధాంపల్లి వద్ద రహదారి విస్తరణలో భాగంగా బ్రిడ్జీని విస్తరించడంతో రవాణా సాఫీగా కొనసాగుతున్నది. నెపల్లివాగుపై వంతెన నిర్మాణానికి మంత్రి హరీశ్రావు రూ.5.60 కోట్లు మంజూరు చేయించగా పనులు కొనసాగుతున్నాయి.
తగ్గిన దూరభారం
వర్షం పడితే రాకపోకలకు ఇబ్బందులు ఉండేవి. బ్రిడ్జి నిర్మాణంతో తిప్పలు తప్పాయి. మంత్రి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో పాటు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయించారు. బ్రిడ్జి నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా మారింది. మంత్రి హరీశ్రావుసారుకు ధన్యవాదాలు.