అక్కన్నపేట, సెప్టెంబర్ 7: నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరవెల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పొతారం(జే) గ్రామానికి చెందిన రంగు కృష్టస్వామి(45) పెయింటర్గా హుస్నాబాద్ పట్టణంలో పని చేస్తున్నాడు. రెండు రోజులనుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని గూడాటిపల్లి- గౌరవెల్లి మధ్య రోడ్డు మీది నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో కృష్టస్వామి పోతారం(జే) నుంచి హుస్నాబాద్కు వెళ్త్తూ రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న హుస్నాబాద్ ఏసీపీ సతీశ్కు విషయం తెలియడంతో రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశాడు. గౌరవెల్లి చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం చెట్ల మధ్య లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేండ్ల నుంచి కుటుంబ కలహాలతో ఇద్దరు కుమారులతో భార్యం ఆండాళు తల్లిగారి ఇంట్లో ఉంటుంది. అప్పటి నుంచి కృష్టస్వామి తాగుడుకు బానిసయ్యాడని గ్రామస్తులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ వేణుగోపాల్రావు, హుస్నాబాద్ సీఐ రఘు, ఎస్సై రవి పరిశీలించారు.
అప్రమత్తంగా ఉండాలి
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతుండటంతో పాటు వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.అత్యవసరమైతే తప్ప బయటకు రాకుం డా ఉండాలి. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.చేపలు పట్టేందుకు కుంటలు, చెరువుల వద్దకు వెళ్లవద్దు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సరదాలు, సాహసాలు చేయవద్దు.
-వాసాల సతీశ్, ఏసీపీ, హుస్నాబాద్