భారీగా కురుస్తున్న వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మంజీర నది వరదతో ఉరకలెత్తుతున్నది. శనివారం రాత్రి కర్ణాటకతో పాటు సంగారెడ్డి జిల్లాలో వాన దంచికొట్టడంతో వాగుల్లో వరద పరవళ్లు తొక్కుతున్నది. మంజీర తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సింగూరు ప్రాజెక్టులోకి 14,734 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. మంజీర ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతున్నది. మెదక్ శివారులోని పసుపులేరు వాగు నిండుగా పారుతున్నది. కామారెడ్డి-మెదక్ సరిహద్దుల్లోని పోచారం డ్యాం పొంగిపొర్లుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మోయెతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
న్యాల్కల్ మండలం మామిడివాగులో ద్విచక్ర వాహన చోదకుడు గల్లంతయ్యాడు.
వనదుర్గా(ఘన్పూర్)ప్రాజెక్టుకు జలకళ
కొల్చారం, సెప్టెంబర్ 5: మండల పరిధిలోని వనదుర్గా(ఘన్పూర్)ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు సింగూరు నుంచి నీటిని వదలడంతో వనదుర్గా(ఘన్పూర్) ప్రాజెక్టు ఆదివారం తెల్లవారుజాము నుంచి పొంగిపొర్లుతున్నది.ఆయకట్టు కింద ముందుగానే వరినాట్లు పడ్డాయి. మంజీరానదిపైన చిలప్చెడ్, కొల్చారం మండలాల పరిధిలో పలుచోట్ల చెక్డ్యాంలు నిర్మాణమవుతుండటంతో వరద ప్రవహిస్తున్నప్పటికీ ప్రాజెక్టు నిండుకుండలాగా ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగూరుకు వరద పోటెత్తడంతో శనివారం సాయంత్రం నుంచి నీటిని వదిలారు. దీంతో ఆదివారం ఉదయం నుంచి వనదుర్గా(ఘన్పూర్) ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తున్నది. తుక్కాపూర్, పైతర, ఎనగండ్ల, కోనాపూర్, సంగాయిపేట గ్రామాలకు చెందిన రైతులు, మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్లకుండా జాగ్రత్త వహించాలని, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్ సూచించారు.
సిద్దిపేట జిల్లాలో 3.76 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు
సిద్దిపేట , సెప్టెంబర్ 5: సిద్దిపేట జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో 3.76 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారాయణరావుపేటలో 11.3.సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీ గా చూస్తే దుబ్బాకలో 4.47 సె.మీ, సిద్దిపేట రూర ల్లో 8.35 సె.మీ, చిన్నకోడూర్లో 1.78 సెం.మీ, బెజ్జెంకిలో 2.49సెం.మీ కోహెడలో 0.07 సెం. మీ, ఆక్కన్నపేటలో 0.09 సెం.మీ, నంగునూర్లో 0.24 సెం.మీ, సిద్దిపేట ఆర్బన్లో 8.17 సెం.మీ, తొగుటలో 2.80 సె.మీ, మిరుదొడ్డిలో 3.87 సెం.మీ, దౌల్తాబాద్లో 1.09 సె.మీ, రాయపోల్లో 0.47 సెం.మీ, వర్గల్లో 0.91 సెం.మీ, ములుగులో 5.72 సెం.మీ, మార్కుక్ 1.06 సెం.మీ, జగదేవ్పూర్లో 7.23 సెం.మీ, గజ్వేల్లో 2.48సెం.మీ, కొండపాకలో 9.66 సెం.మీ, కొమురవెళ్లిలో 10.06 సెం.మీ, చేర్యాలలో 3.01 సెం.మీ,మద్దూర్లో 3.80 సెం.మీ టర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సింగూరుకు భారీగా ఇన్ ఫ్ల్లో..
పుల్కల్ రూరల్, సెప్టెంబర్ 5 : సంగారెడ్డి జిల్లా పరిధిలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవా హం కొనసాగుతున్నది. 29.917 టీఎంసీలకు చేరువలో సింగూరు ప్రాజెక్టు ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కొన్ని రోజులుగా ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాగు, సాగుకు ఎలాంటి ఇబ్బంది లేదని నీటి పారుదలశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వరద రూపంలో ప్రాజెక్టులోకి 14,734 క్యూసెక్కుల నీరు వచ్చింది. ప్రస్తు తం ప్రాజెక్టులో 25.296 టీఎంసీల నీరు నిల్వ ఉం ది. కెనాల్ కాల్వ ద్వారా 140 క్యూసెక్కులు, ఈవీఏపీ 140 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూఎస్ 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూసెక్కులు, మొత్తంగా 590 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతుందని, 63 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ మజార్ మహమ్మద్ తెలిపారు.
దంచికొట్టిన వాన
మెదక్, సెప్టెంబర్ 5: మెదక్ జిల్లా తడిసి ముద్దయింది. అన్ని మండలాల్లో వర్షంతో ప్రాజెక్టు లు, చెరువులు, వాగులు, వంక లు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెలు జలమలమయ్యాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.జిల్లా వ్యాప్తం గా 45.99 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
వర్షపాతం ఇలా..
జిల్లా వ్యాప్తంగా 45.99 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హవేళీఘణాపూర్ మండలంలో 93.0 మి.మీ, వెల్దుర్తి లో79.4 మి.మీ, తూప్రాన్లో 75.0 మి.మీ, అల్లాదుర్గంలో 69.9 మి.మీ, మనోహరాబాద్లో 64.6 మి.మీ, మెదక్లో 57.2 మి.మీ, అత్యల్పంగా మాసాయిపేటలో 13.5 మి. మీ, చేగుంటలో 17.1 మి.మీ, పెద్దశంకరంపేటలో 28.1 మి. మీ, నార్సింగిలో 22.3 మి. మీటర్ల వర్షపాతం నమోదైంది.
వాహన చోదకు గల్లంతు
న్యాల్కల్, సెప్టెంబర్ 5 : వాగు కల్వర్టుపై నుంచి దాటుతుండగా ద్విచక్ర వాహన చోదకుడు వరదలో గల్లంతైన సంఘటన సంగారెడ్డి జిల్లా న్యా ల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో ఆదివారం జరిగింది. హద్నూర్ పోలీసులు, స్థానికుల కథ నం ప్రకారం.. మండలంలోని రేజింతల్ గ్రామ శివారులోని ఎల్గోయి వైపు వెళ్లే రోడ్డు మార్గంలోని మామిడివాగు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ఈ రోడ్డు మార్గం గుం డా ఝరాసంగం, ఎల్గోయి, రేజింతల్ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.శనివారం రాత్రి నుంచి వాగు కల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత చర్యగా ప్రమాదాలు జరుగకుండా రేజింతల్ సర్పంచ్ కుతుబోద్ధీన్తో పాటు గ్రామస్తులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎల్గోయి వైపు నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు లో పడి కొట్టుకుపోయాడు. గల్లంతైన వాహనచోదకుడి కోసం గ్రామస్తులు, హద్నూర్ పోలీసులు గాలింపుచర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఈ సంఘటన స్థలాన్ని జహీరాబాద్ రూరల్ సీఐ నాగేశ్వర్రావు, హద్నూ ర్ ఎస్సై వినయ్కుమార్ సందర్శించారు. వాగులో గల్లంతైన వాహనచోదకుడి వివరాలను గ్రామ
సర్పంచ్ కుతుబోద్ధీన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ రోడ్డు మార్గంలో వాహనాలు, పాదచారుల రాకపోకలు కొనసాగకుండా హెచ్చరిక బోర్డులతో పాటు స్టాపర్లను ఏర్పాటు చేశారు.
ఉప్పొంగుతున్న ‘మోయతుమ్మెద’
ధూళిమిట్ట, సెప్టెంబర్ 5 : ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి ఇప్పటికే నిండుకుండలా ప్రవహిస్తున్న మోయ తుమ్మెదవాగు మరోసారి ఉప్పొంగుతున్న ది. మండలంలోని లింగాపూర్, ధూళిమిట్ట, తోర్నా ల, జాలపల్లి గ్రామాలతో పాటు నంగునూర్ మండలంలోని ఖాతాలో మోయతుమ్మెద ప్రవహిస్తున్నది. ధూళిమిట్ట, భైరాన్పల్లి గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోగా.. తోర్నా ల, బెక్కల్ గ్రామాల గుండా ప్రజలు తిరిగి వెళ్లాల్సి వస్తున్నది.
పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
ఝరాసంగం, సెప్టెంబర్ 5: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఝరాసంగంతో పాటు గంగాపూర్, జీర్లపల్లి, మేదపల్లి, సిద్దాపూర్, ఏడాకులపల్లి, దేవరంపల్లి తదితర గ్రామాల్లోని చెరువుల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. జీర్లపల్లి చెరువులోకి భారీగా వరద రావడంతో మత్తడిదుంకుతున్నది. ఝరాసంగం పెద్దవాగు ద్వారా పారుతున్న వరద జోన్నెగావ్, వాగుగుండా ఉధృతంగా దిగువకు చేరుకుని సింగూర్ డ్యాంలోకి వెళ్తున్నదని అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. చెక్డ్యాం, చెరువులు, కుంటల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొమురవెల్లిలో 49.8 మి.మీవర్షపాతం నమోదు
కొమురవెల్లి, సెప్టెంబర్ 5 : మండలం వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగులు, వంకల్లోకి నీరు వచ్చిచేరుతున్నది. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీటము నిగాయి. కొమురవెల్లి మండలం వ్యాప్తంగా 49.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మద్రి రహదారిపై ప్రవహిస్తున్న వరద
కోహీర్, సెప్టెంబర్ 5: మండలంలోని బిలాల్పూర్, పైడిగుమ్మల్, మద్రి, గురుజువాడ, రాజనెల్లి తదితర గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నారింజ వాగు ఉధృతంగా పారుతున్నది. కొత్తూర్, మద్రి జాతీయ రహదారి గుండా గ్రామానికి వెళ్లే రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
పొంగిపొర్లిన వాగులు
మునిపల్లి, సెప్టెంబర్ 5 : రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఆదివారం పరిసర ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో పొంగిపొర్లుతున్న జలాలను చూసేందుకు సంబంధిత గ్రామాల ప్రజలు తరలివెళ్లారు.ఈ సందర్భంగా ప్రమాదకర ప్రాంతాల్లో మునిపల్లి ఎస్సై మహేశ్వర్రెడ్డి తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
పోచారం డ్యామ్కు వరద ఉధృతి
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 5: మెదక్- కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం డ్యామ్కు వరద ఉధృతి పెరగడంతో పొంగిపొర్లుతున్నది. కామారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో గంగమ్మవాగుతో పాటు ఇతర వాగుల నుంచి వరద ఉధృతి పెరిగింది. మండలంలోని బి.తిమ్మాయిపల్లి, లింగ్సాన్పల్లి, హవేళీఘనపూర్ చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. పోచారం డ్యామ్ వద్ద పర్యాటకులు రాకుండా ఉండేందుకు హవేళీఘనపూర్ ఎస్సై శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యామ్ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు.