ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వర్షం
నీట మునిగిన పంటలు
పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
చెక్డ్యాం, కుంటలు చెరువుల్లోకి భారీగా చేరుతున్న వరద
స్తంభించిన రాకపోకలు
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 4 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
న్యాల్కల్, సెప్టెంబర్ 4 : మండలంలో భారీ వర్షం కురిసింది. హద్నూర్, ముంగి, రుక్మాపూర్, గుంజోట్టి, న్యాల్కల్, ఆత్నూర్, మిర్జాపూర్ (ఎన్), చీకూర్తి, హుస్సేనగర్, అత్నూర్, డప్పూర్, చినిగేపల్లి, చాల్కి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కుంటలు, చెక్డ్యాం, చెరువుల్లోకి నీరు భారీగా చేరింది. మండలంలోని డప్పూర్, చీకూర్తి, అత్నూర్ గ్రామ శివారులోని వాగులు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దశంకరంపేటలో 56.2 మీ.మీ భారీ వర్షం
పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 4 : మండలంలో 56.2 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మండలంలోని చెరువుల్లో, కుంటల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. పెద్దశంకరంపేట పట్టణ శివారులో పత్తిపంట నీట మునిగింది. పేట పట్టణంలో మురుగు కాల్వలు పొంగి పొర్లడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో భారీ వర్షానికి పలు ఇళ్లు కూలిపోయాయి.
తూప్రాన్లో నాలుగు గంటల పాటు..
తూప్రాన్/రామాయంపేట, సెప్టెంబర్ 4 : తూప్రాన్ పట్టణంలో మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శనివారం పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వర్షం భారీగా కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. మధ్యా హ్నం మొదలైన వర్షం రాత్రి కూడా కురుస్తూనే ఉంది. వివిధ పనుల కోసం తూప్రాన్కు పల్లె ప్రాంతాల నుంచి చేరుకున్న చిరు వ్యాపారులు వర్షంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వెల్దుర్తిలో భారీ వర్షం
వెల్దుర్తి, సెస్టెంబర్ 4. మండల కేంద్రమైన వెల్దుర్తితో పాటు మండలం వ్యాప్తంగా శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం 4 గంటలకు చినుకులతో ప్రారంభమైన వర్షం నిమిషాల వ్యవధిలోనే మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో భారీ వర్షంగా మారింది. సుమారు గంటపాటు కురిసిన వర్షంతో వెల్దుర్తిలో జరిగే వారంతపు అంగడికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే, దుకాణాలను ఏర్పాటు చేసిన వ్యాపారులు సైతం నానా అవస్థలు పడ్డారు. దాదాపు నెల రోజుల తరువాత భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
బోరు నుంచి పాతాళగంగ పైపైకి..
నిజాంపేట, సెప్టెంబర్ 4 : కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు నిండడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఈ మేరకు మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన లద్ద రాజయ్య వ్యవసాయ బోరు నుంచి విద్యుత్ ప్రమేయం లేకుండా పాతాళ గంగ పైపైకి ఉబికివస్తున్నది. అటుగా వెళ్తున్న గ్రామస్తులు, సమీప రైతులు బోరు నుంచి వస్తున్న పాతాళ గంగను చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. భూగర్భజలాలు పెరుగడంతో బోర్ల నుంచి అధికంగా నీళ్లు వస్తుండడంలో రైతులు సంబురపడుతున్నారు.