హయత్నగర్ : మదర్ డెయిరీ పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని సంస్థ పాల సెంటర్ల చైర్మన్లు డిమాండ్ చేశారు. గురువారం హయత్నగర్లోని మదర్ డెయిరీ ఎదుట ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని పాల సెంటర్ల చైర్మన్లు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం కానుకగా పాడి రైతులకు లీటర్కు రూ.5 పెంచాలని డిమాండ్ చేశారు. రాజపేట, భువనగిరి చిల్లింగ్ స్టేషన్లలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని, సూర్యపేట చిల్లింగ్ స్టేషన్ చెకింగ్ చేయడానికి వెళ్లిన రైతులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులను రద్దు చేయాలని అన్నారు.
పరిగి, మల్లెపల్లి దుకాణాలపై పాత టెండర్ రద్దు చేసి నూతన టెండర్ను అమలు చేయాలని పేర్కొన్నారు. సిబ్బందికి వేతనాలు పెంచి పాడి రైతులకు ధర పెంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 2020 నుంచి సిబ్బందిని పరిగణనలోకి తీసుకుని ప్రైవేట్ మార్కెటింగ్ చేస్తున్న వారిని తొలగించాలని, 159వ బోర్డు సమావేశంలో పెట్టిన ప్రమోషన్లను వెంటనే నిలపివేయాలని డిమాండ్ చేశారు.
మదర్ డెయిరీ ముందున్న పార్లర్లను సంస్థ సిబ్బందితోనే నడిపించాలని కోరారు. అనంతరం మదర్ డెయిరీ సంస్థ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల సెంటర్ల చైర్మన్లు వెంకట్ నర్సింహారెడ్డి, పావని, సోమయ్య, క్రిష్ణ, రాంరెడ్డి, మహేందర్రెడ్డి, పీర్ల ఐలయ్య, భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.