కవాడిగూడ : రెండు తెలుగు రాష్ట్రాలపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అలాంటి మహానేత ఆధ్వర్యంలో పేదల కోసం, వైశ్య జాతి హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ శాఖ, లక్డీకాపూల్ వాసవి దవాఖాన, వాసవి ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ ముషీరాబాద్ సంయుక్తాధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళ నాడు, కర్ణాటక మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య సంతాప పభ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ కార్యనిర్వహక అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్తా ఆధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, వీ3 ఛానల్ సీఎండీ కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొని రోశయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దివంగత నేత రోశయ్య ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి, తమిళనాడు, కర్ణాటక గవర్నర్గా ప్రజలకు సేవలందించి పదవులకే వన్నె తెచ్చారని అన్నారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ రోశయ్య 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించి ప్రజానికానికి ఎంతో సేవ చేశారని అన్నారు. అహర్నిషలు పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహా వ్యక్తి రోశయ్య అని ఆయన కొనియాడారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ప్రజల అభివృద్దికి కృషి చేసిన వ్యక్తి అని అన్నారు.
కార్యక్రమంలో వామ్స్ ప్రెసిడెంట్ నాగభూషణం, వీబీజీ ఛైర్మన్ ఎం. రాము, మాజీ వాసవి సేవా సమితి అధ్యక్షుడు రాజశేఖర్ గుప్తా, వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు ఆలంపల్లి శ్రీనివాస్, ఐవీఎం రాష్ట్ర కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా విభాగం కోశాధికారి గంగిశెట్టి సుజాత, పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాస్, నాయకులు గౌరి శెట్టి శ్రీనివాస్, పీఎస్ఆర్ మూర్తి, వీబీజీ రాజు, ఆలేటి రవి తదితరులు పాల్గొన్నారు.