మరికల్, జనవరి 19 : ఏసీబీ వలకు రెవెన్యూ అవినీతి చేప చిక్కింది. రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన నారాయాణపేట జిల్లా మరికల్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో చోటు చేసుకున్నది. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్కోట గ్రామానికి చెందిన రాచాల సతీష్ అలియాస్ సత్యనారాయణకు నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామ శివారులో 1.7 ఎకరాల భూమి ఉన్నది. అయితే గతేడాది ఏప్రిల్లో అనారోగ్యంతో సతీష్ మృతి చెందాడు. తర్వాత అతడి భార్య రాచాల శ్రీశైల సర్వే నెంబర్ 204/ఆ-బీ2, 205/ఆ/3లో ఉన్న ఎకరా 7 గుంటల భూమిని విరాసత్ చేసేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించింది. మరికల్ తాసిల్దార్ శ్రీధర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. రూ.40 వేలు ఇస్తే పని చేసిపెడుతానని ఆమెను డిమాండ్ చేశాడు. అయితే తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, భర్త లేకపోవడంతో బతుకు దెరువు కోసం హైదరాబాద్లో ఇండ్లల్లో పనిచేస్తూ బతుకుతున్నానని చెప్పింది. అంత మొత్తం ఇచ్చుకోలేనని ప్రాధేయపడింది. దీంతో రూ.25 వేలు ఇవ్వాలని తాసిల్దార్ కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో చివరగా.. రూ.20 వేలు ఇవ్వాల్సిందే అన్నాడు. తర్వాత ఈ విషయాన్ని శ్రీశైల తన ఇంటి సమీపంలో ఉన్న రుక్మొద్దీన్కు ఈ విషయాన్ని చెప్పగా ఇద్దరూ కలిసి ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి పథకం ప్రకారం బుధవారం తాసిల్దార్ శ్రీధర్ విరాసత్ చేయగా.. బాధిత మహిళ రూ.20 వేలు అందించింది. వెంటనే ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ ఎస్సై లింగస్వామి, నల్లగొండ ఏసీబీ ఎస్సై రామారావు దాడులు చేశారు. ఫైళ్ల మధ్యలో రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే హైదారాబాద్ చైతన్యపురి కాలనీలో ఉన్న శ్రీధర్ నివాసంలోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నెంబర్కు గానీ, సెల్ నం : 9491305609కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.