మియాపూర్ : నిరుపేద గిరిజన తెగకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏండ్లకు పైగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తమపై జులుం ప్రదర్శిస్తున్నదని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఆర్పీఎఫ్ తీరును నిరసిస్తూ సోమవారం పెద్ద ఎత్తున కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బస్తీవాసి తుకారంనాయక్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా 500 లకు పైగా గిరిజన కుటుంబాలు నడిగడ్డ తండాలోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. తమ స్థలంలో కేంద్రం సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. వర్షాలకు దెబ్బతిన్న గుడిసెలు బాగు చేసుకునేందుకు బలగాలు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సీఆర్పీఎఫ్ క్యాంపుకు సంబంధించిన హద్దులు నిర్ణయించాలని ఆయన కోరారు. చాలా ఏండ్లుగా నివాసముంటున్న తమ ఇండ్లకు నంబర్లు వచ్చాయని, పన్నులు చెల్లిస్తున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం రహదారులు సహా ఇతర సౌకర్యాలను సైతం కల్పించిందన్నారు.
నిరుపేదలైన వందలాది గిరిజన కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. పేద గిరిజన కుటుంబాలు ఎప్పటి నుంచో ఈ స్థలంలో నివాసం ఉంటున్నాయని, వారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కోరారు. సీఆర్పీఎఫ్ క్యాంపు పేరుతో గిరిజనులపై దాడులకు పాల్పడుతుండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవటంలోనూ సిబ్బంది ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు.