బండ్లగూడ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ మూసీ నదిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను రాజేంద్రనగర్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తహసీల్ధార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బధవారం ఉదయం ఆరు గంటల సమయంలో రెవిన్యూ సిబ్బంది వాటిని తొలగించారు.
భారీ బందోబస్త్ మధ్య మూసీ ఒడ్డున వెలిసిన ఆరు భవనాలు, ఒక సెడ్డు నిర్మాణాలను తొలగించారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్త వాతవరణం చోటు చేసుకుంది. వారందరినీ పోలీసులు చెదరగొట్టడంతో గొడవ లేకుండా రెవెన్యూ సిబ్బంది తమ పని పూర్తి చేశారు.
అనంతరం రాజేంద్రనగర్ తహసీల్ధార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మూసీ వెంట వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను ఇదివరకే తాము గుర్తించి పునాది స్థాయిలోనే తొలగించడం జరిగిందన్నారు. కాని కొందరు రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు చేపట్టి కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు.
ఇక నుంచి మూసీలో కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మూసీ రివర్ఫ్రంట్ డైరెక్టర్ మాలతీ, డీటీ రవిందర్, ఆర్ఐలు సారిక, వినయ్లత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.