హయత్నగర్ : ట్రాక్టర్ను వెనుక నుండి రెడిమిక్స్ లారీ ఢీకొన్న ఘటనలో ఓ కార్మికుడు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ డివిజన్ రంగనాయకులగుట్టకు చెందిన రేపని ఎల్లప్ప(32), శేఖర్(40), నాగరాజు(42), రాము (32) వృతిరీత్యా రాళ్లు కొట్టే పనులు చేస్తుంటారు. గురువారం ఉదయం ముగ్గురు కలిసి ట్రాక్టర్ నెం.(టీఎస్07యుఇ 6387)లో పెద్దఅంబర్పేట నుండి హయత్నగర్కు వచ్చి వర్డ్ అండ్డీడ్ స్కూల్ వద్ద యూటర్న్ తీసుకుంటున్నారు.
అదే సమయంలో పెద్దఅంబర్పేట నుండి అతివేగం, అజాగ్రత్తగా దూసుకొచ్చిన రెడిమిక్స్ లారీ నెం.(ఏపీ16టిజె3483), ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న ఎల్లప్ప కిందపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు కార్మికులు శేఖర్, నాగరాజు, రాము తీవ్రంగా గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎల్లప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.