జాతీయ రహదారులు 65,163ను కలుపుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్ఆర్ఆర్ నిర్మాణం జిల్లాలో మొదటి దశలోనే కార్యరూపం దాల్చనున్న రహదారి
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర రాజధానిలో కిక్కిరిసిన వాహనాలతో ప్రయాణం నరకంగా మారుతున్నది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నగరానికి వెలుపల బాహ్య, అంతర్గత వలయాలను నిర్మించింది. ఇదే క్రమంలో తాజాగా.. మరో ప్రాంతీయ వలయ రహదారి కార్యరూపం దాల్చుకుంటున్నది. దీన్ని రెండు భాగాల్లో నిర్మించనున్నారు. ఉత్తర భాగమైన సంగారెడ్డి, నర్సాపూర్, తుప్రాన్, గజ్వేల్, జగ్దేవ్పూర్, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల మీదుగా 158 కిలోమీటర్ల మేర తొలి దశలో నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి ఎన్హెచ్-166ఏఏగా నామకరణం చేశారు. ఔటర్ రింగు రోడ్డుకు 40 కిలోమీటర్ల వెలుపల..జిల్లాలోని జాతీయ రహదారులు 65, 163లను కలుపుతూ ట్రిపుల్ ఆర్ నిర్మాణం ఉండడం.. రియల్ రంగానికి బాగా కలిసి వచ్చే అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రియల్టర్లు రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం జరిగే ప్రాంతాలకు క్యూ కట్టారు. కొనుగోలు దారుల సందడితో.. పల్లె ప్రాంతంలోనూ భూముల ధరలు చుక్కలనంటుతున్నది. నిన్న మొన్నటి వరకు లక్షల్లో ఉన్న భూముల విలువ కోట్లకు పరుగులెత్తుతున్నది. ఇదిలా ఉండగా..వలయదారికి చెంతనే ఉన్న చిన్న, చిన్న పట్టణాలు మరింతగా పురోగమించేందుకు ఈ నూతన ప్రాజెక్టు దోహదపడనుంది. దినదినాభివృద్ధి చెందుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు ఈ రహదారి మరో మణిహారంగా నిలువనుంది.
హైదరాబాద్తో అనుసంధానమయ్యే జాతీయ రహదారులను కలుపుతూ రీజినల్ రింగురోడ్డును కార్యరూపంలోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారులతో రవాణా పరంగా చాలా వరకు ఇబ్బందులు తీరాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా పునర్నించిన యాదాద్రి ఆలయం.. జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతున్నది. జిల్లాలో ఉన్న జాతీయ రోడ్లు ఆలంబనగా పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రియల్ రంగం ఊపందుకోగా.. ఉపాధి అవకాశాలు సైతం పెరిగాయి. ఔటర్ రింగు రోడ్డు సైతం దగ్గరలోనే ఉండడంతో జిల్లా మీదుగా ఇతర రాష్ర్టాలకు రాకపోకలు సైతం సులభతరంగా మారాయి. హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య సైతం చాలావరకు తీరింది. రీజినల్ రింగు రోడ్డు వల్ల భవిష్యత్తులో జిల్లా ముఖచిత్రంలో సమూలంగా మార్పులు రానున్నాయి.
ఉత్తరభాగంలో చేపడుతున్న నిర్మాణానికి సంబంధించి కసరత్తు ముమ్మరంగా సాగుతున్నది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 15 మండలాల్లోని 113 గ్రామాల మీదుగా వెళ్లేలా తాజాగా మార్గాన్ని ఖరారు చేయగా..ఇందుకు గాను 1,904 ఎకరాలను సేకరించాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇందులో సింహభాగం యా దాద్రి భువనగిరి జిల్లాలో 800 ఎకరాలకు పైగా భూసేకరణ జరపాల్సి ఉంది. భూసేకరణకోసం యా దాద్రి భువనగిరి జిల్లా అదనపు(రెవెన్యూ) కలెక్టర్తోపాటు నాలుగు జిల్లాల పరిధిలోని ఏడుగురు ఆర్డీఓలతో ప్రత్యేకంగా కాంపిటెంట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సర్వే నంబర్ల వారీగా గెజిట్ విడుదలైన వెంటనే భూసేకరణ ప్రక్రియ మొ దలుకానుంది. భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అ యిన వెంటనే ఆయా భూముల్లోని సర్వే నంబర్లలో మార్కింగ్ చేసి నోటీసుల జారీతో సేకరణ ప్రక్రియ ను చేపట్టనున్నారు. అయితే భూసేకరణకు అవరోధాలు లేకుండా ఉండేందుకు కాళేశ్వరం కాల్వ నిర్మాణాలకు, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం మ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారుల వెంట ఉన్న భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలు పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఇప్పటికే దండు మల్కాపురం పారిశ్రామిక కారిడార్గా రూపుదిద్దుకుంటుంది. హైదరాబాద్కు చెంతనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా చుట్టూ సైతం వందల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. మెరుగుపడ్డ రవాణా వ్యవస్థతో ఔత్సాహికులు సైతం ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకువస్తున్నారు. ఇక రీజినల్ రింగు రోడ్డు అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యం మరింతగా పెరిగి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఈ ప్రాంతానికి తరలిరానున్నాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతోపాటు, వ్యవసాయేతర పరిశ్రమలు కూడా నెలకొల్పేందుకు మెండుగా అవకాశాలు కలగనున్నాయి. ఇదే క్రమంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఎన్నో రాష్ర్టాలకు కేంద్ర బిందువుగా మారుతున్న జిల్లాలో రవాణా సౌకర్యం సైతం అత్యంత సౌలభ్యం కానుంది. ఏదిఏమైనా.. హైదరాబాద్కు చెంతనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎన్నో ప్రాంతాల ప్రగతికి ప్రాంతీయ రహదారి దోహదం చేసే అవకాశం ఉంది.