విద్యార్థుల సంఖ్య బాగా ఉన్నా.. సరిపడా ఉపాధ్యాయులు ఉండే వారు కాదు. కొన్నిచోట్లయితే డిప్యూటేషన్పై వచ్చిన వారో, వలంటీరో మాత్రమే కనిపించేవారు. ఏ రోజైనా ఆ ఒక్కరూ రాలేదంటే బడికి సెలవే.ఇలాంటి అనేక సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 317 పరిష్కారం చూపుతున్నది. పీఏపల్లి, డిండి, నేరేడుగొమ్ము, దేవరకొండ, సంస్థాన్ నారాయణపురం వంటి మారుమాల మండలాల్లోని అనేక బడులకు పునర్జీవం ప్రసాదించింది. నిరుపేద విద్యార్థులకు చదువును చేరువ చేసింది. ఏండ్ల తరబడి మూతబడిన అనేక పాఠశాలలు కొత్త జోనల్ విధానంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. సింగిల్ టీచర్ స్కూళ్లు పోస్టుల కేటాయింపునకు నోచుకున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరుపేద విద్యార్థుల మొహాల్లో చిరునవ్వులు పూస్తున్నాయి. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా
1,418 మంది టీచర్ల కేటాయింపులు జరగ్గా, కొవిడ్ సెలవుల అనంతరం అంతా కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు.
విద్యారంగం బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి.
తాజాగా నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీల(జిల్లావారీ కేటాయింపులు)తో ప్రభుత్వ
పాఠశాలలు జీవం పోసుకుంటున్నాయి. జీఓ నంబర్ 317తో నల్లగొండ జిల్లాలోని ఐదు
మారుమూల మండలాలతో పాటు పలు గ్రామాల్లోని విద్యార్థులకు మేలు జరిగింది. జీరో, సింగిల్
టీచర్ స్కూళ్లకు జీఓ ద్వారా భరోసా దొరికింది. 374మంది ఎస్జీటీలు ఈ నెల 7న స్కూల్
కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో విధుల్లో చేరారు. విభజన అనంతరం అన్ని పాఠశాలలకు
ఉపాధ్యాయులను కేటాయించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
317 జీఓతో మూత పడ్డ పాఠశాలలకు మోక్షం
రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ విద్యాసంవత్సరం చేపడుతున్న‘మన ఊరు మన బడి’కార్యక్రమంతో మారుమూల ప్రాంతాల్లోనూ విద్యాకాంతులు ప్రసరించనున్నాయి. గతంలో మూతబడిన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఉపాధ్యాయుల రాకతో విద్యార్థుల చేరికతో సందడిగా మారనున్నాయి. చందంపేట మండలంలోని పెద్దమూల, బుడ్డోని తండా, లెడప తండా, కోరుట్ల, నల్లచెలముల, తెల్దేవర్పల్లి, పాత తెల్దేవర్ పల్లి, బండమీది తండా, బండ కింది తండా, ఎలమల మంద, కంబాలపల్లి, గుంతల్ తండా, కాట్రావత్ తండా, బుడ్డోని తండా, కాకునూరి తండా, వెంకట్ నాయక్ తండా, చిత్రియాల, నక్కలగండి తండా, పోల్యా నాయక్ తండాలతో పాటు నేరెడుగొమ్ము మండలంలోని ఉప్పుగండి తండా, పడమటి తండా, ఇంద్రావత్ తండా, మూలవాగు తండా, పైమూలవాగు తండా, కలకుండ తండా, ధర్మరేక్యా తండా, వైజాగ్ కాలనీ, బుగ్గ తండా, కేతేపల్లి, పెద్దమునిగల్ గ్రామాల్లోని పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకంతో డిప్యుటేషన్ ఉపాధ్యాయులు తిరిగి తమ స్థానానికి వెళ్లనున్నారు. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనుండడంతో ప్రైవేటు స్కూళ్లపై ప్రభావం పడనున్నది. ఆంగ్ల విద్యాబోధన కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రైవేటులో అడ్మిషన్లు గణనీయంగా తగ్గనున్నాయి.
నల్లగొండ జిల్లాలో 61 పాఠశాలల్లో డిప్యుటేషన్ ఉపాధ్యాయులే…
నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లో 61 పాఠశాలల్లో విద్యార్థులున్నారు. రెగ్యులర్ టీచర్స్ లేకపోవడంతో విద్యాశాఖాధికారులు సమీప పాఠశాలల ఉపాధ్యాయులకు డిప్యుటేషన్ కల్పించారు. విద్యా వలంటీర్లు కూడా పనిచేస్తున్నారు. అత్యధికంగా డిప్యుటేషన్పై ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలు డిండి, చందంపేట, నేరెడుగొమ్ము, చింతపల్లి మండలాల్లో ఉన్నాయి.
కొత్తగా ఉపాధ్యాయుల రాక..
సంస్థాన్ నారాయణపురం, జనవరి 19 : జీఓ నంబర్ 317 సర్కారు పాఠశాలలకు ఊపిరి పోసింది. మండల వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 37, ప్రాథమికోన్నత 3, ఉన్నత 6 మొత్తం 46 పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయలు కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న 23 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా 26 మంది కొత్తగా వచ్చారు. గంగమూలతండా, రాచకొండ, మహ్మదాబాద్ పాఠశాలకు వారిని కేటాయించారు. ఉపాధ్యాయుల కొరతతో నాలుగేండ్లుగా మూతబడిన గంగమూల తండా ప్రాథమిక పాఠశాల తిరిగి తెరుచుకోనుండడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
కాంప్లెక్స్ స్కూల్స్లో చేరిన టీచర్లు…
ఎస్జీటీ సమాన హోదాతో జిల్లాలకు వచ్చిన 374 మంది టీచర్లంతా ఈనెల 7న స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు రిపోర్ట్ చేశారు. తాజా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభంకాగానే వీరంతా విధుల్లో చేరనున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని మారుమూల మండలాలైన పీఏపల్లి, డిండి, చందంపేట, నేరెడుగొమ్ము, చింతపల్లిలోని పలు పాఠశాలల్లో బోధించనున్నారు.
జీరో నుంచి ఇద్దరు వచ్చారు…
పీఏపల్లి మండలం పోల్కంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఎంపీపీఎస్)లో 65 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు రెగ్యులర్ టీచర్ పోస్టులు ఉండగా 2015లో జరిగిన బదిలీల్లో ఇక్కడి ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. తిరిగి ఇక్కడికి ఎవ్వరూ రాకపోవడంతో విద్యా వలంటీర్లు, పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై పనిచేశారు. ఈ క్రమంలో తాజా బదిలీల్లో భాగంగా ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు వచ్చారు. ఇదే మండలంలోని పడమటి తండా, తూర్పు తండాతోపాటు దేవరకొండ మండలంలోని ఎల్లారెడ్డిబాయి (32మంది విద్యార్థులు), ఏఎస్తండా(28 మంది పిల్లలు) పాఠశాలలదీ ఇదే పరిస్థితి. కొత్తగా ఉపాధ్యాయులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
317 జీఓతో ఎంతో మేలు…
317 జీఓతో విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. మా గ్రామంలో బడి తిరిగి తెరుచుకుంటుందని ఎన్నడూ అనుకోలేదు. ఈ మధ్య కాలంలో మా తండాల్లో ఉన్న బడిలో టీచర్లు జాయిన్ అయినట్లు తెలిసింది. సెలవులు పూర్తి కాగానే బడి తెరుచుకుంటుంది. ఇన్నాళ్లూ ప్రైవేటు పాఠశాలలో డబ్బులు ఖర్చుచేసి పిల్లలను చదివిస్తున్నరు. ఇప్పుడు ఆ బాధ తప్పింది. పేద కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాయి.
సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు..
సార్లు లేక నాలుగేండ్లుగా బడి మూతపడింది. దూరం పోయి చదువుకోవాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నరు. ప్రైవేటులో చదివించే స్థోమత లేక చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కానీ, మాలాంటోళ్ల బాధలు అర్థం చేసుకుని కొత్తగా సార్లను పంపిస్తున్న సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
మా బడిలో అన్ని సౌకర్యాలు సమకూర్చుతాం…
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు తెరిపించడం చాలా సంతోషకరం. మా బడికి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మన ఊరు మన బడి ప్రణాళికలో భాగంగా మెరుగైన వసతులు కల్పించేందుకు భారీగా నిధులు కేటాయించారు. సర్పంచ్గా నా వంతు బాధ్యత తీసుకొని పనులు వేగవంతం చేయిస్తా.
విభజన ప్రక్రియతో జరిగిన న్యాయం…
జీఓ నంబర్ 317తో జీరో, సింగిల్ టీచర్తోపాటు డిప్యుటేషన్పై ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలకు మహర్దశ లభించింది. ఉమ్మడి జిల్లా కేడర్ స్ట్రెంత్ ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలు జరుగగా.. ప్రక్రియకు ముందు ఏర్పడిన ఖాళీలతోపాటు తాజా ఉద్యోగుల సర్దుబాటుతో ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకున్నారు. ఆయా పాఠశాలల్లో అవసరాలు, జీఓ మార్గదర్శకాలు అనుసరించి కలెక్టర్ ఆదేశాలు, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల సలహాలతో సర్దుబాటు చేసి పోస్టింగ్ ఇచ్చారు.
32మంది పిల్లలకు ఒక్క ఉపాధ్యాయుడు..
దేవరకొండ మండలం ఎల్లారెడ్డిబాయి ఎంపీపీఎస్లో 32మంది విద్యార్థులు ఉండగా 2018 నుంచి ఓ ఉపాధ్యాయుడు డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. కొత్త జోనల్ విధానంలో ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులను కేటాయించగా ఈ నెల 7న విధుల్లో చేరారు.
మారుమూల మండలాలకు 136మంది టీచర్లు..
దేవరకొండ నియోజకవర్గంలోని నేరెడుగొమ్ము, చందంపేట, డిండి మండలాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండేది. దానిని అధిగమిస్తూ జీఓ 317తో ఆయా మండలాలకు కొత్తగా 136మంది ఉపాధ్యాయులు వచ్చినట్లు ఇన్చార్జి ఎంఈఓ సౌమ్యానాయక్ తెలిపారు. కలెక్టర్, డీఈఓ, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు(ఎంపీపీ, జడ్పీటీసీ) సూచనలతో ప్రాధామ్యాల వారీగా కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అన్ని పాఠాశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరిందని, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.